నల్లగొండ : తెలంగాణ పోలీసింగ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల రక్షణ, నేర విచారణ, నేరస్థులకు శిక్షలు పడేలా చేయడంలో అగ్రభాగంలో నిలుస్తున్నదని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ అమర వీరుల స్థూపానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశ రక్షణ, అంతర్గత భద్రతలో తమ జీవితాలను ఫణంగా పెట్టి ప్రజల కోసం, సమాజం కోసం పోలీస్, మిలటరీ సిబ్బంది పోరాడుతున్నదని వారి త్యాగాలను ఆయన కొనియాడారు. శాంతి భద్రతల నిర్వహణలో పోలీస్ శాఖ అత్యంత కీలక బాధ్యత వహిస్తున్నదన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడిన షీ టీమ్స్ ద్వారా మహిళా రక్షణలో మన రాష్ట్రం దేశంలోనే ముందుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో పోలీస్ శాఖ పాత్ర అత్యంత కీలకమని గుర్తించిన తొలి పాలకుడు కేసీఆర్ అన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన స్మృతి పరేడ్ కు పరేడ్ కమాండర్ గా ఆర్.ఐ. స్పర్జన్ రాజ్ వ్యవహరించారు. అనంతరం అమర పోలీస్ కుటుంబ సభ్యులతో జిల్లా పోలీసు కార్యాలయంలో వారి సమస్యలు, సంక్షేమం గురించి డిఐజి ప్రత్యేకంగా చర్చించి వారికి అండగా ఉంటామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ ఏవీ రంగనాధ్ తదితరులు ఉన్నారు.