మహబూబాబాద్ : తెలంగాణలో శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పోలీసులు పనిచేస్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ అభివృద్ధితో పాటు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై దృష్టి సారించారని తెలిపారు.
పోలీసులకు ఎక్స్ గ్రేషియా పెంచడంతోపాటు దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. ఫిర్యాదులు చేయడానికి, దోషులను కలవడానికి, పోలీస్ స్టేషన్ కు చిన్నారులతో వచ్చే మహిళలు ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ రూమ్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు తీసుకుంటున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ సత్పలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఫిర్యాదుల కోసం పౌరులు స్వేచ్ఛగా పోలీసులను ఆశ్రయిస్తున్నారని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు షీ టీమ్స్, సఖి సెంటర్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి మెరుగైన సేవలను అందిస్తుందన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, పోలీస్ సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.