రాష్ట్రం అనేక కార్యక్రమాల్లో దేశానికి పాఠాలు నేర్పుతున్నది
వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రోత్సాహంతో 5 విప్లవాలు
మేధావులు దేశం వెనుకబాటుకు కారణాలు ఆలోచించాలి
భారత్ నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాలి
నేడు తెలంగాణ చేసేది.. రేపు భారత్ చేస్తుంది
హార్వర్డ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్
‘2030 నాటికి భారతదేశ అభివృద్ధి’పై ప్రసంగం
భారత్ తన బలమైన మానవ వనరులు, ఆలోచనాశక్తిని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. భారత్ నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశగా ఇన్నోవేషన్ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం టీహబ్, వీహబ్, అగ్రిహబ్ వంటి ఇంక్యుబేటర్లను చేపట్టింది. ఒకప్పుడు బెంగాల్ ఆలోచించినది, తరువాత భారతదేశం ఆలోచిస్తున్నదన్న నానుడి ఉండేది. నేడు తెలంగాణ ఆలోచించింది, చేసింది.. రేపు భారతదేశం చేస్తుందన్న విశ్వాసం నాకు ఉన్నది.
–మంత్రి కే తారకరామారావు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 : భారత్లో ఉన్న వనరులు, అవకాశాలను సరైన విధంగా వాడుకొంటే దేశ పురోగతిని ఆపడం ఎవరి తరం కాదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలో అతి తక్కువ వయసున్న తెలంగాణ అనేక కార్యక్రమాల్లో దేశానికి పాఠాలు నేర్పేలా దూసుకుపోతున్నదని, తెలంగాణ విధానాలను స్ఫూర్తిగా తీసుకొంటే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ‘2030 నాటికి భారతదేశ అభివృద్ధి’ అంశంపై ఆదివారం నిర్వహించిన హార్వర్డ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. దేశాభివృద్ధి మరింత వేగంగా, విప్లవాత్మకంగా ముందుకు సాగాలంటే కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు వెతుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద కాటన్ ఉత్పత్తి చేసే దేశంగా భారత్ ఉన్నా, బంగ్లాదేశ్, శ్రీలంక కన్నా తకువ దుస్తులను ఎందుకు ఉత్పత్తి చేస్తున్నది? ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ధరల కన్నా భారత్లో తయారుచేసే మెడికల్ పరికరాల ధర ఎందుకు ఎక్కువగా ఉంటున్నది? భారత్ కన్నా అతి చిన్న దేశాలైన వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు తయారీ రంగంలో ఎందుకు అగ్రగామిగా నిలిచాయి? ఇందులో భారత్ను అడ్డుకొంటున్న పరిస్థితులు ఏమిటి? దేశంలోని నదుల్లో నిండా నీళ్లు పారుతున్నా బీడు భూములు ఎందుకున్నాయి? కరువు పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? తదితర ప్రశ్నలపై దేశంలోని ప్రభుత్వాలు, మేధావులు, విద్యావేత్తలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని గుర్తుచేశారు. భారత్, చైనా జీడీపీ 35 ఏండ్ల కిందట సమానంగా ఉండేదని, ఈ రోజు చైనా భారతదేశం కన్నా అనేక రంగాల్లో ముందు వరుసలో ఉన్నదన్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. సరైన పరిపాలన విధానాలు, ప్రాధాన్యాలు, భవిష్యత్తుకు అవసరమయ్యే విప్లవాత్మక సంసరణలు, ప్రపంచస్థాయి అవసరాలకు సిద్ధంగా ఉండేలా మౌలిక వసతులు కల్పించడం వంటి ప్రాథమిక కార్యక్రమాలను చేపడితే దేశ పురోగతి వేగంగా ముందుకుపోతుందని అభిప్రాయపడ్డారు.
ప్రగతిశీల విధానాలతో తెలంగాణ ముందంజ
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ మొదలుకొని టీఎస్బీపాస్, నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు, నూతన విధానం ద్వారా ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ వంటి అనేక అద్భుత కార్యక్రమాలు నేడు తెలంగాణను అభివృద్ధిలో ముందువరుసలో నిలిపేందుకు దోహదం చేస్తున్నాయని అన్నారు. దీనితోపాటు కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర ప్రాజెక్టులకు చేపట్టి విజయవంతంగా పూర్తిచేసిందని, రోడ్ల నిర్మాణం, వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందని వెల్లడించారు. రైతుబంధు, టీఎస్ఐపాస్, పట్టణ ప్రకృతివనాల వంటి కార్యక్రమాలను కేంద్రం సహా అనేక రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకొని, తమ తమ రాష్ట్రాల్లో ప్రారంభించాయని గుర్తుచేశారు. పారిశ్రామిక రంగం, ఐటీ, విద్య, వైద్యరంగాల్లో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రోత్సాహంతో ఐదు వ్యవసాయ విప్లవాలు రాష్ట్రంలో పరిఢవిల్లే స్థాయికి చేరాయని వెల్లడించారు.
ఇన్నోవేషన్కు ప్రోత్సాహం ఇవ్వాలి
భారత్ తన బలమైన మానవ వనరులు, ఆలోచనాశక్తిని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్ నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉన్నదని, ఈ దిశగా ఇన్నోవేషన్ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం టీహబ్, వీహబ్, అగ్రిహబ్ వంటి ఇంక్యుబేటర్లను చేపట్టిందని వివరించారు. ఒకప్పుడు బెంగాల్ ఆలోచించినది, తరువాత భారతదేశం ఆలోచిస్తున్నదన్న నానుడి ఉండేదని, నేడు తెలంగాణ ఆలోచించింది, చేసింది.. రేపు భారతదేశం చేస్తుందన్న విశ్వాసం తనకు ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు.