హైదరాబాద్ : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నిర్వహించిన సీసీటీఎన్ఎస్ హ్యాకథాన్ అండ్ సైబర్ ఛాలెంజ్-2022లో తెలంగాణ పోలీస్ టూల్కు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం దక్కింది. ఈ ఏడాది మార్చి 11 నుంచి ఏప్రిల్ 25 వరకు జరిగిన ఈ హ్యాకథాన్లో మొత్తం మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ మేరకు సీసీటీఎన్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రషూణ్ గుప్తా బుధవారం విజేతల జాబితాను ప్రకటించారు. దేశవ్యాప్తంగా పోలీసు విధుల్లో ఉపయుక్తంగా ఉండే సరికొత్త అప్లికేషన్ తయారీ విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి తొలిస్థానం దక్కింది.
సైబర్ క్రైమ్ అనాలసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టం సైకాప్స్ టూల్ను ఏర్పాటుకు ఇంటిలిజెన్స్ సెల్ ఎస్పీ దేవేందర్సింగ్కు ఈ ఘనత దక్కింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో హర్యానా పోలీసులు రూపొందించిన యాప్స్ నిలిచాయి. సీసీటీఎన్ఎస్ బగ్ హంటింగ్ విభాగంలో మొదటి బహుమతి సగే యూనివర్సిటీ విద్యార్థి ఎస్ శర్మకు, ద్వితీయ బహుమతి అకామీ టెక్నాలజీస్కు చెందిన అహుతోష్ కుమార్, జీరోఫాక్స్ కంపెనీకి చెందిన షరీఖ్ రాజాలకు దక్కాయి. ఇన్నొవేటివ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టెక్నాలజీస్ విభాగంలో సీబీఐ ఢిల్లీ యూనిట్కు చెందిన ఎస్పీ ప్రవీణ్ మండ్లోయి, ద్వితీయ బహుమతి జమ్మూ, కాశ్మీర్కు చెందిన ఎస్ఐ అజయ్ సౌదాన్, మధ్యప్రదేశ్కు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు పుష్పేంద్ర యాదవ్, రాధా మోహన్ త్రిపాఠిలకు దక్కాయి.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నిర్వహించిన సీసీటీఎన్ఎస్ హ్యాకథాన్ అండ్ సైబర్ ఛాలెంజ్-2022లో జాతీయస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన రాష్ట్ర పోలీస్శాఖకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. పోలీస్శాఖ సాధించిన విజయాన్ని డీజీపీ మహేందర్రెడ్డి బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. డీజీపీ ట్విట్పై మంత్రి కేటీఆర్ స్పందించడంతో పాటు పోలీస్శాఖకు అభినందనలు చెప్పారు. సీసీటీఎన్ఎస్ హ్యాకథాన్ అండ్ సైబర్ ఛాలెంజ్-2022లో తెలంగాణ పోలీస్ టూల్కు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు.
Congratulations 👏 TS Police https://t.co/opFyWX2THr
— KTR (@KTRTRS) June 22, 2022