హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీస్ శాఖ అమలు చేస్తున్న వినూత్న విధానాలను ఇతర రాష్ట్రాల పోలీస్ అధికారులు అధ్యయనం చేసి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని డీజీపీ (DGP) అంజనీ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఉత్తమ సేవలందిస్తున్న రిసెప్షన్ అధికారులకు ప్రత్యేక పురస్కారాలు(Special awards), కొవిడ్(Covid) తో మరణించిన పోలీసుల పిల్లలకు స్కాలర్షిప్లు అందించే కార్యక్రమాన్ని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ రాణి రుద్రమ దేవి ఆడిటోరియంలో బుధవారం జరిగింది.
ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు మెరుగైన పోలీస్ వ్యవస్థను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్లో 17 వర్టికల్స్ పని విధానాలను ప్రవేశ పెట్టామని అన్నారు. ఈ వర్టికల్స్ విధానాన్ని అధ్యయనం చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు తెలంగాణ(Telangana)కు వచ్చి అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వచ్చే పిటీషనర్లకు దరఖాస్తు రాయడంతోపాటు వారికి తగు మార్గదర్శనం చేయాలని డీజీపీ సూచించారు.
దర్యాప్తు అధికారి, స్టేషన్ హౌజ్ ఆఫీసర్, పిటీషనర్ల మధ్య రిసెప్షన్ అధికారి ఒక వారధిలా ఉండాలని సూచించారు. తమ పరిధిలోని పౌరులకు మరిన్ని ప్రామాణికమైన సేవలందించేందుకు గాను వినూత్న విధానాలను ప్రవేశపెట్టే స్టేషన్ హౌజ్ అధికారులు, ఏసీపీ, డీసీపీ లలో 20 మంది అధికారులను ప్రత్యేకంగా గుర్తించి తగు పురస్కారాలు అందించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 80 వేలకు పైగా పోలీస్ అధికారులు వివిధ స్థాయిల్లో ఉన్నారని, వీరందరికీ వృత్తి పరమైన ప్రమాణాల పెంపునకు వేర్వేరు శిక్షణ మాడ్యూల్స్ రూపొందించాలని సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ అధికారులను ఆదేశించారు.
కొవిడ్ పరివర్తన్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ కార్యక్రమంలో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు ద్వారా ఎంపిక చేసిన 75 మంది ఉత్తమ సేవలందిస్తున్న రిసెప్షన్ ఆఫీసర్లు, 68 మంది కొవిడ్ బాధిత పిల్లలకు ప్రత్యేక పురస్కారాలు, స్కాలర్షిప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ లు అభిలాష బిస్త్, సందీప్ శాండిల్య, మహేష్ భగవత్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.