B Vinode Kumar | రాజన్న సిరిసిల్ల : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ కింద చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలితాలు నేడు ప్రజల కళ్లెదుటే సాక్షాత్కరిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీ రిజర్వాయర్కు మంత్రి గంగుల కమలాకర్తో కలిసి నీటిని విడుదల చేశారు. అనంతరం వినోద్కుమార్ మాట్లాడుతూ మండు టెండళ్లల్లోనూ వర్షాభావ పరిస్థితుల్లోనూ కాళేశ్వరం జలాలు రాష్ట్రానికి వరప్రదాయినిగా మారాయన్నారు.
మేడిగడ్డ నుంచి ఎత్తిపోతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టి ఉండకపోతే.. తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో ఊహకు కూడా అందేది కాదన్నారు. వర్షాలు లేకపోయినా నేడు వరద కాలువ నిండులా ప్రవహిస్తోందన్నారు. కాళేశ్వరం జలాలతో ఇప్పటికే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో దాదాపు మూడు టీఎంసీల నీటితో నింపామని, వరద కాలువలో 122 కిలోమీటర్ల పొడవు 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. వరద కాలువ ద్వారా 80 చెరువులను నింపుతున్నామని, కాలువ చుట్టూ భూగర్భ జలాలు పెరిగి అన్నదాతలకు కల్పతరువుగా మారిందన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం జలాలతో సాగుకు ఢోకా లేకుండాపోయిందన్నారు.
రైతాంగానికి చింత లేకుండా పోయిందన్నారు. ముఖ్యంగా వర్షం కోసం ఆకాశం వైపు చూడాల్సిన పని లేకుండా పోయిందని చెప్పారు. ప్రధానంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా అధిక లాభం జరుగుతోందన్నారు. వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎత్తిపోస్తున్న కాళేశ్వరం జలాలతోనే మొదటగా లబ్ధి పొందేది కరీంనగర్ ఉమ్మడి జిల్లేనన్నారు. త్వరలోనే వరద కాలువను కాకతీయ కెనాల్ డీ-86కు లింకు చేయబోతున్నట్లు తెలిపారు. తద్వారా పెద్దపల్లి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు కూడా కాళేశ్వరం జలాలు అందుతాయని చెప్పారు.
వరద కాలువను నాడు వరదకు మాత్రమే వినియోగించారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సాగునీటి రంగంపై ఉన్న అపార అనుభంతో.. కాలువను బహుళ ప్రయోజనాలు ఇచ్చే కల్పతరువుగా మార్చారన్నారు. సాగునీరు, రైతుబంధు, ఉచిత కరెంటు ఇస్తూ.. రైతును రాజు చేసే ప్రభుత్వం కావాలా..? లేక ఉచిత విద్యుత్కు తూట్లు పొడిచే పార్టీలు కావాలా..? అన్నారు. నిజానికి సమైక్య రాష్ట్రంలోనే కాళేశ్వరంలాంటి ఎత్తిపోతల పథకం ఉండి ఉంటే.. తెలంగాణ ప్రాంత రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారా..? ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు.