హైదరాబాద్ : రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీలలో 2020-21 సంవత్సరానికి గాను ఆన్లైన్ ఆడిటింగ్ 100% పూర్తయింది. ఈ నివేదికను కేంద్రానికి సమర్పించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అమలు చేస్తున్న ఆన్లైన్ ఆడిట్ విధానంలో దేశంలోని రాష్ట్రాలలో అన్ని గ్రామ పంచాయతీలు కలుపుకొని 13 శాతం మాత్రమే ఆడిట్ పూర్తవగా, తెలంగాణ రాష్ట్రం సులభంగా 100 శాతం పూర్తి చేసి రికార్డు సృష్టించిందని ఆయన తెలిపారు. దేశంలోని మొత్తం 2 లక్షల 50 వేల 561 గ్రామ పంచాయతీలకు గాను, ఇప్పటివరకు 32 వేల 820 గ్రామ పంచాయతీలలో ఆన్లైన్ ఆడిట్ పూర్తయిందన్నారు.
ఇందులో తెలంగాణ 12,769 గ్రామ పంచాయతీలలో దాదాపు 40 శాతం వాటాను భర్తీ చేయడం విశేషం అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 6,703 పంచాయతీ సమితి, మండల పరిషత్తును ఆన్ లైన్ ఆడిట్ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, అందులో తెలంగాణలో 540 మండల పరిషత్తులకు గాను 156 మండలాల్లో ఆడిట్ పూర్తి చేసి రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ దిశానిర్దేశం కారణంగానే తెలంగాణ రాష్ట్రం గ్రామ పంచాయతీలలో ఆన్లైన్ ఆడిట్ 100% పూర్తి చేసిందని, అదేవిధంగా మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులలో ఎక్కువ శాతం ఆడిట్ పూర్తి చేసి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచినందని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులలో ఆన్లైన్ ఆడిటింగ్ త్వరగా పూర్తి చేయడానికి నిరంతరం పర్యవేక్షణ, సూచనలు చేసిన మంత్రి టీ. హరీష్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే లక్ష్య సాధనలో అహర్నిశలు కృషి చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ శరత్, రాష్ట్ర ఆడిటింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా క్షేత్ర స్థాయిలో ఆడిటింగ్ విజయవంతంగా నిర్వహించడానికి సమన్వయంతో కృషి చేసిన పంచాయతీరాజ్ శాఖ అధికారులకు, సిబ్బందికి, ఆడిట్ అధికారులకు, సిబ్బందికి మంత్రి ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు.