రాష్ట్రంలో 5,999 సర్కారీ దవాఖానలు
మొత్తం 27,996 బెడ్లు
స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 23 : ఆరోగ్య రంగంలో జాతీయ సగటు కంటే తెలంగాణ పనితీరు బాగుందని రాష్ట్ర స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వైద్యరంగంపై దృష్టిపెట్టారు. రాష్ట్రంలో టీచింగ్ దవాఖానల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు మొత్తం 5,999 ఉండగా, అందులో 27,996 పడకలున్నాయి. రాష్ట్రంలో 35,610 అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లల్లో, గర్భిణులు, బాలింతల్లో న్యూట్రిషన్ పెంచడానికి పోషకాహారం అందిస్తున్నది. 2020-21లో 2,93,026 మంది తల్లులకు, 12,75,773 పిల్లలకు పోషకాహారం అందించింది. రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటు తగ్గింది. సంతానోత్సత్తి రేటు 1.6 శాతంగా ఉన్నది. రాష్ట్రంలో మనుషుల సగటు ఆయుష్షు కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. ఇక, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతున్నదని వెల్లడించింది. అటు.. సిజేరియన్లు తగ్గించి బాలింతల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ అద్భుత విజయం సాధించిందని పేర్కొన్నది.
పెరిగిన రాష్ట్ర ప్రజల సగటు ఆయుష్షు
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఆరోగ్య సూచీలో జాతీయ సగటు కన్నా తెలంగాణ మెరుగ్గా ఉన్నదని నివేదిక స్పష్టం చేసింది. ‘ప్రతి వెయ్యి మందిలో జననాల రేటు దేశ సగటు 19.7 ఉండగా, రాష్ట్ర సగటు 16.7గా ఉన్నది. ఏడాదిలోపు పిల్లల మరణాలను పరిశీలిస్తే ప్రతి వెయ్యి మందికి దేశంలో 30 మంది మరణిస్తే తెలంగాణలో 23 మంది మరణిస్తున్నారు. నవజాత శిశువుల మరణాలు పుట్టిన 28 రోజుల్లోపు మరణించే వారి సంఖ్య దేశ సగటు 23 ఉండగా, రాష్ట్ర సగటు 19గా ఉన్నది. బాలింతలు ప్రతి లక్ష మందికి దేశంలో 113 మంది మరణిస్తే, రాష్ట్రంలో 63 మంది మరణిస్తున్నారు’ అని పేర్కొన్నది. ఇక, దేశంలో పురుషుల సగటు ఆయుష్షు 66.9 ఏండ్లు, మహిళల సగటు ఆయుష్షు 70.3 ఏండ్లు ఉండగా, తెలంగాణలో పురుషుల సగటు ఆయుష్షు 69.4, మహిళల సగటు ఆయుష్షు 73.2 ఏండ్లుగా ఉన్నదని నివేదిక వెల్లడించింది.
కేసీఆర్ కిట్ విశేషాలు
పథకం ప్రారంభం: 2017 జూన్ 2
ప్రభుత్వ దవాఖానలో మగబిడ్డ పుడితే రూ.12 వేలు
ప్రభుత్వ దవాఖానలో ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు
2020-21లో 2,14,576 కిట్లు అందజేత