హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మెదక్ రైల్వేలైన్.. ఆ ప్రాంత ప్రజల 60 ఏండ్ల డిమాండ్.. దశాబ్దాలపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఎన్నో హామీలిచ్చినా రైలు మాత్రం రాలేదు. మెదక్కు కూడా ఆ పార్టీలు ప్రాతినిధ్యం వహించాయి. సాక్షాత్తూ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినా కల కలగానే మిగిలింది. కానీ.. తెలంగాణ వచ్చిన 8 ఏండ్లలోనే మెదక్-అక్కన్నపేట రైలు పరుగులు పెట్టింది. ప్రజల కల తీరింది.
ఇది ఎవరివల్ల సాధ్యమైంది? రైల్వే లైన్ కోసం సొంత నిధులతో భూములు సేకరించింది తెలంగాణ సర్కారు.. నిర్మాణ వ్యయంలో సగం నిధులు భరించింది తెలంగాణ సర్కారు.. మొత్తంగా ఈ రైల్వేలైన్ నిర్మాణ వ్యయంలో మూడోవంతు భరించింది తెలంగాణ సర్కారు.. కానీ, రైల్వే లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రం శనివారం ఇచ్చిన ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వం పేరు లేదు.. ఎంతో కృషిచేసి ప్రజల కలను నిజం చేసిన సీఎం కేసీఆర్ ఫొటో లేదు. ఆ జిల్లా మంత్రి పేరు కనిపించలేదు. అక్కడి ప్రజా ప్రతినిధుల ప్రస్తావన అసలే లేదు. ప్రకటన కోసం కేంద్రం చేసిన ఖర్చు ఈ దేశ ప్రజల సొమ్మే.. అంటే అందు లో తెలంగాణ సొమ్ముకూడా ఉన్నట్టే.. తెలంగాణ సొమ్ముతో జారీచేసిన ప్రకటనలో తెలంగాణ ఊసే లేదు.. ఇదీ బీజేపీ చిల్లర రాజకీయం.
శృతిమించుతున్న అసహనం
వాపును చూసి బలుపు అనుకొన్న కాషాయపార్టీ నేతలకు.. వాస్తవం బోధపడుతుండటంతో అసహనం పెరిగిపోతున్నది. ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఇట్లా ఎన్ని పాదయాత్రలు చేసినా బీజేపీని జనం పట్టించుకుంటలేరు. డబ్బులిచ్చి బహిరంగ సభలకు తీసుకొచ్చిన జనం కూడా సోది ప్రసంగాలు వినలేక మధ్యలోనే పారిపోతున్నరు.
దీంతో ఏం చేయాలో అర్థం కాక తమకు అలవాటైన హింసామార్గాన్నే నమ్ముకొంటున్నారు. కేంద్రం విధానాలను ప్రశ్నిస్తున్న ప్రజలపై, లోపాలను బయటపెడుతున్న విలేకరులు, యూట్యూబర్లపై దా డులు చేస్తున్నారు. కావాలనే గొడవలు సృష్టించేందుకు బీజేపీ అధ్యక్షు డు బండి సంజయ్ సహా పార్టీ నేతలంతా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు.
పాదయాత్ర పేరుతో సంజయ్ చేస్తున్న సర్కస్ ఫీట్లను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవటంలేదు. దీంతో బండి బ్యాచ్లో నిస్పృహ పెరిగిపోయి స్వాతంత్య్ర దినోత్సవం రోజునే జనగామ జిల్లా దేవరుప్పులలో బీజేపీ బౌన్సర్లు, గూండాలు, రౌడీమూకలు కలిసి గ్రామస్థులపై దాడులు చేసి రక్తపాతం సృష్టించారు. అదే జిల్లా కూనూరులో ఓ యువకుడు కేంద్రం విధానాలపై సంజయ్ని ప్రశ్నించగా.. బీజేపీ నేతలు, కార్యకర్తలు పిడిగుద్దులు కురిపించారు. బీజేపీ సభల్లో ముక్కూమొఖం తెలియని నేతలు అర్థం కాని భాషలో అడ్డగోలుగా మాట్లాడుతుంటే కిరాయికి వచ్చిన జనం కూడా మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నారు. ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న విలేకరులు, యూట్యూబర్లపై బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారు. నాలుగోవిడుత యాత్ర సందర్భంగా నిర్వహించిన సభల్లో రెండుసార్లు యూట్యూబ్ చానల్ విలేకరులపై బీజేపీ నేతలు దాడి చేశారు.