హైదరాబాద్ : నిన్న వనపర్తి సభలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రేపు ఉదయం 10 గంటలకు శాసనసభా వేదికగా నిరుద్యోగులకు శుభవార్త వినిపిస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో మీడియా కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై విస్తృతంగా చర్చా కార్యక్రమాలు చేపట్టింది. నిరుద్యోగ భృతి ప్రకటిస్తారా? లేక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారా? అన్న కోణంలో చర్చలు నిర్వహించాయి. నిరుద్యోగులు, ప్రజలు కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చించారు. ఎలాంటి ప్రకటన వస్తుందనే అంశంపై నిరుద్యోగులు తమ వాట్సాప్ గ్రూపుల్లో చర్చించారు.
మొత్తంగా దాదాపు 16 గంటల ఉత్కంఠకు కేసీఆర్ ఇవాళ ఉదయం 10 గంటలకు శాసనసభా వేదికగా తెరదించారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రసంగం వినేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, నిరుద్యోగులు టీవీలకు అతుక్కుపోయారు. ఉద్యోగ నియామకాలపై కేసీఆర్ సభలో దాదాపు గంట పాటు విస్తృతంగా వివరించారు. ఈ గంట పాటు కొనసాగిన ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. కేసీఆర్ ఉద్యోగాల జాతర ప్రకటించడంతో జనాలు హర్షం వ్యక్తం చేశారు.