హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. దేశ ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపేందుకు జీవితాంతం పోరాడిన మహనీయుడి కృషికి గుర్తింపుగా, నివాళిగా తీర్మానాన్ని ఆమోదించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించడంపై హర్షం వ్యక్తంచేస్తూ దళిత సంఘాలు సంబురాలు జరుపుకొన్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో దళిత సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు అశోద రవి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతుబజార్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి, సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హసేన్ సూర్యాపేట రైతుబజార్లోని అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, గుడిహత్నూర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానిలకు క్షీరాభిషేకం చేశారు.
నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అంబేదర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం చరితాత్మకం. అందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన దళితబంధు నిర్మాత, ముఖ్యమంత్రి కేసీఆర్కు, రాష్ట్ర అసెంబ్లీకి ప్రత్యేక ధన్యవాదాలు.
– బండ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
దేశ గతిని మార్చేందుకు కేసీఆర్ ప్రధాని కావాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే నేడు దేశ వ్యవస్థ నడుస్తున్నది. అలాంటి మహనీయుడి పేరును పార్లమెంట్కు పెట్టాలని ఆయన వారసుడిగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతోపాటు తీర్మానం చేయడం గొప్ప విషయం.
– గజ్జెల కాంతం, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్.
కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అభినందనీయం. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అలాంటి మహనీయుడి పేరు కొత్త పార్లమెంట్ భవనానికి పెట్టడం సమంజసం. -కారింగల మారుతీ, మాలల జాతీయ ఐక్య
వేదిక గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు
దళితులతోపాటు అన్ని సామాజిక వర్గాల సంక్షేమం కోసం పాటుబడిన అంబేదర్ పేరును పార్లమెంట్ పెట్టడం సముచితం. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని చెప్పడానికి ఇది నిదర్శనం. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్కు, ఆమోదించిన సభ్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.
– డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్
సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి, మనువాద విషకోరులను చీల్చి చెండాడే నిజమైన దేశభక్తుడు. పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలన్న గొప్ప మనసుతో అసెంబ్లీ తీర్మానం చేయడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– పిడమర్తి రవి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్