వనపర్తి, జనవరి 6 : సీఎం కేసీఆర్ ప్రజానుకూల నిర్ణయాలు, అన్నదాతల అభివృద్ధి కోసం దూరదృష్టితో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల 8 ఏండ్లలోనే తెలంగాణ దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని చెప్పారు.
శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పెబ్బేర్కు వెళ్లే రహదారిలో దాదాపు రూ.3 కోట్లతో నిర్మిస్తున్న వే సైడ్ మార్కెట్, మర్రికుంట పనులను స్థానిక నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీటి వంటి రైతు సంక్షేమ పథకాలు దేశమంతా రావాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నదని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం పంజాబ్ మినహా దేశంలో ఎక్కడా ధాన్యం కొనుగోలు చేయడం లేదని మంత్రి విమర్శించారు. రైతులు పంటలను అమ్ముకోవడానికి కూడా అవస్థలు పడుతున్నట్లు జాతీయ రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. రైతు సంక్షేమ పథకాల వల్ల వలసలు తగ్గిపోయి నేడు తెలంగాణ పల్లెల్లో ఉపాధి పెరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు.