కామారెడ్డి, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో నిరుపేద వృద్ధులకు అందిస్తున్న ఆసరా పెన్షన్లకు అర్హత వయస్సును కుదించడంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరుగనున్నది. వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సును 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించిన సీఎం కేసీఆర్.. అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 57 ఏండ్లు నిండిన పేదలు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 31 నాటికి 57 ఏండ్లు నిండినవారిని అర్హులుగా గుర్తించారు. దీంతో 33 జిల్లాల నుంచి 7,37,471మంది దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి అత్యధికంగా 58 వేలు, ములుగు నుంచి అత్యల్పంగా 5,800 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా విభజిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాల కోసం జిల్లా అధికార యంత్రాంగం ఎదురుచూస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు వృద్ధులకు రూ.200, దివ్యాంగులకు రూ.500 పింఛన్ ఇచ్చేవి. ఇవి కనీస అవసరాలకు కూడా సరిపోవని గుర్తించిన సీఎం కేసీఆర్ పింఛన్లను భారీగా పెంచారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పింఛన్లను పెంచుతూ ఆయా కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు. 2014 అక్టోబర్లో ప్రారంభమైన ఆసరా పథకం లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు గౌరవంగా బతికేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతనందిస్తున్నారు. బీడీ కార్మికులకు జీవన భృతి పథకాన్ని 2015 మార్చి ఒకటో తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఒంటరి మహిళలకు పింఛన్ పథకాన్ని 2017 ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు రూ.2016, దివ్యాంగులకు ప్రతి నెలా రూ.3016, ఇతర వర్గాల వారందరికీ రూ.2016 చొప్పున పింఛన్లు అందిస్తున్నది.
వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును ప్రభుత్వం 57 ఏండ్లకు కుదించడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను త్వరలోనే పరిశీలిస్తాం. లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిశాఖ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో విభజన చేస్తున్నాం.
-రమేశ్బాబు, ప్రాజెక్టు మేనేజర్, పెన్షన్ల విభాగం(డీఆర్డీఏ), కామారెడ్డి జిల్లా