హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): పోలవరం అథారిటీ సమావేశంలో ముంపు సమస్యలపై మాట్లాడటాన్ని ఏపీ అధికారులు అడ్డుకోవటంపై తెలంగాణ తీవ్రంగా మండిపడింది. అథారిటీ సమావేశంలో ప్రాజెక్టు ముంపు సమస్యలపై మాట్లాడకపోతే మరెక్కడ మాట్లాడాలని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ 15వ సమావేశం ఖైరతాబాద్లోని కృష్ణాగోదావరి భవన్లో సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కొనసాగింది. పోలవరం ప్రాజెక్టు ఫలితంగానే భద్రాద్రికి ముంపు ముంచుకొస్తున్నదని, ఇకనైనా కాలయాపన చేయకుండా వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్చేశారు. దీనిపై ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముంపు సంబంధిత సమస్యలను సీడబ్ల్యూసీ, కేంద్ర జల్శక్తి శాఖ పలు సమావేశాలను నిర్వహించిందని, వాటిని అక్కడే ప్రస్తావించాలని, పీపీఏలో ఎందుకని అడ్డుకొన్నారు.
ఏపీ తీరుపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యలను ప్రాజెక్టు అథారిటీలో చర్చించడంలో తప్పేమిటని నిలదీశారు. అభిప్రాయాలను చెప్పేందుకు ఇతర రాష్ర్టాలకు అవకాశమివ్వకుంటే సమావేశానికి ఎందుకు ఆహ్వానించినట్టు అని మండిపడ్డారు. ముంపు సమస్యలపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రాజెక్టు ప్రభావిత రాష్ర్టాలతో కేంద్రం ఇటీవల వరుస సమావేశాలను నిర్వహించగా, అందులో బలంగా తమ వాదనలు వినిపించామని గుర్తుచేశారు. ఏపీ అధికారులు ఇటీవల తెలంగాణలో పర్యటించగా, ముంపు ప్రభావిత ప్రాంతాలను డిమార్కేషన్ చేసి మరీ చూపించామని నొక్కిచెప్పారు. తెలంగాణ, ఏపీ అధికారుల వాదనలతో సమావేశం ఉద్రిక్తంగా మారుతుండటంతో పీపీఏ చైర్మన్ జోక్యం చేసుకొని ఇరువురిని శాంతింపజేశారు. తెలంగాణ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇస్తే పరిశీలించి సమాధానమిస్తామని హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పలు ముంపు సమస్యలపై సిద్ధం చేసిన నోట్ను పీపీఏకు అందజేశారు. అనంతరం పీపీఏ చైర్మన్ మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని అత్యున్నత న్యాయస్థానం సూచించిందని చెప్పారు. సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, సీఈ మోహన్కుమార్, ఈఈ సుబ్రహ్మణ్యప్రసాద్, ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇంజినీర్లు, కేంద్ర జలసంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
పీపీఏకు అందజేసిన లేఖలోని అంశాలు
పోలవరం ప్రాజెక్టు వల్లే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది భద్రాద్రి వద్ద వరద పోటెత్తిందని నిపుణుల కమిటీ తేల్చిచెప్పిందని ఈఎన్సీ లేఖలో వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల గోదావరి నదిలోకి వచ్చి కలిసే ఇతర 35కు పైగా వాగులు, వంకలు గతంలో మాదిరిగా కలువలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటిని నిల్వ చేసినప్పుడు భద్రాద్రి వరకు బ్యాక్వాటర్ 43 అడుగులపైకి నిలిచి ఉంటాయని తెలిపింది. అంటే నిత్యం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే భద్రాద్రి వద్ద గోదావరి ఉంటుందని నొక్కిచెప్పింది. ఇక 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్టయితే భద్రాద్రితోపాటు, మొత్తంగా 40 వేల ఎకరాల మేర ముంపునకు గురవుతుందని స్పష్టంగా పేర్కొన్నారు.