Telangana | హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించింది. అనతికాలంలోనే బియ్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. గత ఏడాది వరకు పంజాబ్తో పోటీపడి రెండో స్థానానికే పరిమితమైన తెలంగాణ.. ఈ ఏడాది పంజాబ్తోపాటు ఉత్తరప్రదేశ్ (యూపీ), పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ర్టాలను వెనక్కి నెట్టి అగ్ర స్థానానికి చేరుకొన్నది. బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ వన్గా నిలిచిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం పౌరసరఫరాలు, ఆహార శాఖ తాజాగా నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం 2022-23లో 160.14 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తితో తొలి స్థానంలో నిలిచింది. 156.37 లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, 151.71 లక్షల టన్నులతో యూపీ మూడో స్థానంలో, 131.47 లక్షల టన్నులతో పంజాబ్ నాలుగో స్థానంలో నిలిచాయి.
కేసీఆర్ కష్టం.. అగ్రస్థానానికి రాష్ట్రం
రాష్ట్రం ఏర్పడే నాటికి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ తొమ్మిదో స్థానంలో ఉండేది. ఇప్పుడు ఏకంగా మొదటి స్థానానికి చేరింది. సీఎం కేసీఆర్ పడిన కష్టం, అమలు చేసిన పథకాలు ఇప్పుడు తెలంగాణను దేశంలో అగ్రపథాన నిలబెట్టాయి. రాష్ట్రం ఏర్పాటైంది మొదలు వ్యవసాయాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం విశేష కృషి చేశారు. వ్యవసాయరంగం, రైతులు ఎదుర్కొంటున్న ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చారు. వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడం నుంచి మొదలైన ఈ పథకాల పరంపర కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఇతర ప్రాజెక్టులు పూర్తి చేయడం, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాలతో శిఖర స్థాయికి చేరింది. పథకాలతో రైతుల్లో భరోసా నింపారు. ఒకప్పుడు దండగన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ తన చాతుర్యంతో పండుగ చేసి చూపించారు. తద్వారా ఇప్పుడు బియ్యం ఉత్పత్తిలో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపారు.
భారీగా పెరిగిన వరి సాగు
కాళేశ్వరంతోపాటు ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ధాన్యం ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. 2014-15లో రాష్ట్రంలో రెండు సీజన్లలో సాగైన వరి విస్తీర్ణం 35 లక్షల ఎకరాలు మాత్రమే. అది 2022-23లో 1.21 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే తొమ్మిదేండ్లలో 86 లక్షల ఎకరాల్లో వరి అదనంగా సాగైంది. ఈ ఏడాది యాసంగి, వానకాలం అనే తేడా లేకుండా రెండు సీజన్లలోనూ సమాన స్థాయిలో వరి సాగు కావడం విశేషం. వానకాలంలో 64.54 లక్షల ఎకరాల్లో, యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇదిలా ఉంటే 2014-15లో కేవలం 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, ప్రస్తుతం ఇది 2.66 కోట్ల టన్నులకు పెరిగింది. గతంతో పోల్చితే 1.98 కోట్ల టన్నులు అధికంగా ఉత్పత్తి అవుతున్నది. వరి సాగులో కొన్నేండ్లుగా పంజాబ్తో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నది. ఈ ఏడాది పంజాబ్ను వెనక్కి అగ్రస్థానాన్ని అధిరోహించింది.
కేంద్రం కొర్రీలు
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ను దేశానికి అన్నపూర్ణగా కీర్తించేవారు. ఇప్పుడు ఆ రాష్ట్రం నుంచి వేరైన తెలంగాణ ఆ కీర్తిని సంపాదించుకున్నది. ఏపీ నుంచి తెలంగాణ విడిపోతే కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు, పంటలు పండవు అని నాడు శాపనార్థాలు పెట్టారు. ఇప్పుడు వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కీర్తిని తెలంగాణ దక్కించుకున్నది. ఏపీలో గత రెండు సీజన్లలో కలిపి ఉత్పత్తి అయిన బియ్యం 85 లక్షల టన్నులు మాత్రమే. అంటే తెలంగాణలో పండిన బియ్యంలో సగం మాత్రమే. ఇక తెలంగాణలో వ్యవసాయం పండుగై, వరి సాగు పెరుగుతున్నా కొద్దీ కేంద్రం సహించలేకపోయింది. వరిసాగును అడ్డుకునేలా అనేక కుట్రలు చేసింది. రైతులతో వరి సాగు చేయించొద్దని సూచించింది. మరోసారి యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమని తేల్చి చెప్పింది. దీంతో రైతుల్లో కొంత మనోధైర్యం దెబ్బతిన్నది. కానీ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారు. కేంద్రం కొనుగోలు చేయకపోయి నా… తాను కొనుగోలు చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. దాని ఫలితంగా ఇప్పుడు తెలంగాణ బియ్యం ఉత్పత్తిలో నంబర్ వన్గా నిలిచింది.
సీఎం కేసీఆర్ కృషి ఫలితమే
బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా నిలవడం గర్వకారణం. సీఎం కేసీఆర్ అకుంఠిత కృషి, కష్టం వల్లే తెలంగాణకు ఈ కీర్తి దక్కింది. రైతు సంక్షేమ పథకాల అమలు, సాగు నీరు, కరెంట్ కష్టాలు తీర్చి రైతుల్లో భరోసా నింపారు. తద్వారా రాష్ట్రంలో వ్యవసాయం పండుగైంది. వరిసాగు విస్తీర్ణం భారీగా పెరిగింది.
-పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు