హైదరాబాద్ : అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ ఆత్మగౌరవ భవనాల కలను సాకారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం నగరంలోని ఉప్పల్ భగాయత్లో వంజర సంఘం భవనానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బీసీల పక్షపాతిగా నిలుస్తున్నారని అన్నారు. 75ఏళ్ల స్వాతంత్ర్య భారత చరిత్రలో బీసీ సంక్షేమాన్ని కేసీఆర్ మినహా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. 41 కుల సంఘాలకు వేల కోట్ల విలువైన 87.3 ఎకరాలు కేటాయించి ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వాల్లో కుల సంఘ భవనాలు నిర్మించుకుంటామని ఎమ్మెల్యేగా ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా గుంట జాగా కూడా కేటాయించలేదని ఆరోపించారు.
వెనుకబడిన వర్గాలను నాటి పాలకులు వెనుకబాటుకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉప్పల్ భగాయత్లో మరో 13 బీసీ కుల సంఘాల భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నామని వివరించారు. దసరా నాటికల్లా, వసతి, కమ్యూనిటీ హాల్, మీటింగ్ రూం, లైబ్రరీ, రిక్రియోషన్ సదుపాయాలతో బీసీ ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించుకుంటామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వంజర సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.