ధర్మపురి, ఆగస్టు 18: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కాషాయం తమ్ముళ్లు తన్నుకొన్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బీజేపీ విధానాలను ప్రశ్నించిన సొంత పార్టీ కార్యకర్తపై దాడి చేశారు. ఈ ఘటనతో పార్టీలో కార్యకర్తల కు రక్షణ కరువైందని, పట్టించుకొనేవారే లేరని తోటి కార్యకర్తలు ఆవేదన చెందు తున్నారు. దాదాపు మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు తాజాగా బయటకు రావడంతో విషయం బహిర్గతమైంది. దాదాపు మూడు నెలల క్రితం బీజేపీ మండల ఇంచార్జిగా యాదగిరి బాబు బాధ్యతలు తీసుకొన్న సందర్భంగా బుగ్గారంలోని ఓ ఫంక్షన్ హాలులో పరిచయ కార్యక్రమంతోపాటు మండల అధ్యక్ష పదవి ఎన్నిక కోసం నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. పరిచయ కార్యక్రమంలో భాగంగా మండలంలో బీజేపీ ఉనికి, స్థితిగతులపై తెలియజేయాల్సిందిగా ఇంచార్జి యాదగిరి బాబు కార్యకర్తలను కోరారు. దీంతో చందయ్యపల్లికి చెందిన మ్యాడం సాంబయ్య అనే కార్యకర్త మాట్లాడుతూ.. పార్టీ విధానంపై ప్రశ్నించారు. మండలంలో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉన్నదని, కార్యకర్తలను పట్టించుకొనేవారు లేరని వాపోయాడు. దీంతో కోపోద్రిక్తులైన బీజేపీ నాయకులు మంచె రాజేశ్తోపాటు మరికొందరు కార్యకర్తలు సాంబయ్యపై దాడికి దిగారు. దెబ్బలు తాళలేక సాంబయ్య అక్కడి నుంచి పరుగెత్తినా వెంబడించి మరీ చితకబాదారు. కాగా జిల్లా ఇంచార్జి బాబు కలుగజేసుకొని నచ్చజెప్పగా గొడవ సద్దుమణిగింది. గతంలో కూడా ధర్మపురిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో బుగ్గారం గ్రామానికి చెందిన సుంకం ప్రశాంత్ అనే బీజేపీ కార్యకర్తపైనా ఇదేవిధంగా దాడి జరిగింది.