హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం తపించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కలలుగన్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ సాధించడమే కాకుండా ఆ మహనీయుడి ఆశయాలను సాకారం చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణభవన్లో ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం తన జీవితాంతం తపించిన వ్యక్తి జయశంకర్ సార్ అని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆ కల సాకారమైందన్నారు. వినోద్కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి అధ్యాపకుడి దాకా, వర్సిటీ రిజిస్ట్రార్, వీసీ, దేశ ప్రణాళికా సంఘం సభ్యుడిగా అనేక హోదాల్లో పనిచేసినా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే తన జీవితలక్ష్యంగా పెట్టుకొన్న గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు.
వరంగల్ నుంచి ఎదిగివచ్చిన ఎంతోమంది రాజకీయ నాయకులకు, మేధావులకు, విద్యార్థులకు తెలంగాణ ఆకాంక్షలోని అంతస్సూత్రాన్ని వివరించారని చెప్పారు. నలుగురు ఉన్నా లక్షల మంది గుమిగూడినా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ఆధారాలతో సహా వివరించి వారిని తెలంగాణ పట్ల ఆకర్షితులు అయ్యేలా చేసినగొప్ప వ్యక్తి సార్ అని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్తో జయశంకర్ ప్రతి అంశంలో భాగస్వామి అయ్యారని చెప్పారు. ప్రత్యేక రాష్ర్టాన్ని కండ్ల చూడాలి.. సాధించిన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అనే తన సంకల్పాన్ని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని తెలిపారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ అనేక రంగాల్లో దేశానికి మార్గనిర్దేశం చేసే స్థాయికి చేరుకున్నదని చెప్పారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామరక్ష అని పదే పదే చెప్పిన జయశంకర్ ఆలోచనా విధానాన్ని సీఎం సీఆర్ ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు నగేశ్, మేడే రాజీవ్సాగర్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ నాయకులు గెల్లు శ్రీనివాస్, రూప్సింగ్, నాయినేని రాజేశ్వర్రావు, సుశీలారెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు నవీనాచారి తదితరులు పాల్గొన్నారు.
సార్ పోరాటం స్ఫూర్తిదాయకం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. ఈ మేరకు శనివారం కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా జయశంకర్ సార్ నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకం. మీరు గడిపిన జీవితం మహోన్నతం.. స్వరాష్ట్రంలో తెలంగాణ సాగిస్తున్న ప్రగతి ప్రస్థానం సాక్షిగా.. మీకు ఇవే మా నివాళులు.. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్’ అని ట్వీట్ చేశారు.
ఇది నా ఫేవరెట్ ఫొటో
జయశంకర్ సార్తో దిగిన కొన్ని ఫొటోల్లో ఇది నా ఫేవరెట్ అని కేటీఆర్ ఈ సందర్భంగా మరో ట్వీట్ చేశారు. 2009, నవంబర్ 29న అలుగునూరు వద్ద కేసీఆర్ను అరెస్టు చేసిన అనంతరం.. జయశంకర్ సార్, నేను నేరుగా హనుమకొండలోని ఆయన ఇంటికి చేరుకొన్నాం. మరుసటి రోజు ప్రొఫెసర్ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు, నన్ను వరంగల్ జైలుకు తరలించారు’ అని కేటీఆర్ పేరొన్నారు.