హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): దళితులు, బీసీలు, మహిళల హక్కులు 70 ఏండ్ల స్వతంత్ర భారతంలో నెరవేరలేదు కాబట్టే తాను కొత్త రాజ్యాంగం కావాలని డిమాండ్ చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలో అందరికీ సమాన హక్కులు, బాధ్యతల కోసమే ఈ అంశాన్ని లేవనెత్తినట్టు స్పష్టంచేశారు. ‘శాంతి, ప్రేమ పూర్వక దేశాన్ని నిర్మించాలి. కుల, మత, జాతిభేదం లేకుండా అందరికి సమాన హక్కులు, సమాన బాధ్యతలు ఉండాలి. అంబేద్కర్ పేరు చెప్పుకొని బతుకుడు కాదు.. ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి. తెలంగాణలా దేశం పరివర్తన చెందాలి. అందుకే కొత్త రాజ్యాంగం కావాలని అంటున్న’ అని పేర్కొన్నారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
కొత్త రాజ్యాంగం డిమాండ్లో తప్పేముంది?
దేశంలో దళితుల జనాభా 19 శాతానికి పెరిగింది. ఆ మేరకు రిజర్వేషన్లు పెరగాల్సి ఉన్నది. అందుకు కొత్త రాజ్యాంగం కావాలి అంటున్నా.. తప్పా? ఇప్పటికీ ఆడబిడ్డలకు రక్షణ లేదు. వారికి మగపిల్లలకు సమానంగా ఆస్తిలో వాటా ఇవ్వాంటున్నా. దానికోసం రాజ్యాంగం మార్చాలె అంటున్నా.. తప్పా? రాష్ర్టాల హక్కులను కేంద్రం హరిస్తున్నది. ఆ దుర్మార్గమైన పద్ధతిని తొలగించేందుకు కొత్త రాజ్యాంగం కావాలన్నా.. తప్పా? దేశమంతటా దళితబంధు పెట్టేందుకే కొత్త రాజ్యాంగం అడుగుతున్నా.. తప్పా? బీసీలు కులగణన చేయాలంటున్నరు. హక్కులు అడుగుతున్నారు. అందుకే కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.. తప్పా? ఇవ్వాల్టికీ దళితులు అన్నమో రామచంద్రా అంటున్నారు. దళితుల సబ్ప్లాన్ను కూడా కేంద్రం తీసేసింది. గుజరాత్లో దళితులు పెండ్లి చేసుకుని గుర్రం మీద వెళ్తే చంపేస్తున్నరు. అది మార్చాలంటున్నాం. దళితుల కోసమే కొత్త రాజ్యాంగం కావాలంటున్నాం.. తప్పా? 77 శాతం సంపద 10 శాతం మంది దగ్గర కాదు, 90 శాతం మంది దగ్గర ఉండాలని అంటున్నాం.. తప్పా? అంతర్జాతీయ ట్రక్కు స్పీడ్ 105 కిలోమీటర్లుంటే, మన దేశంల ట్రక్కు స్పీడు 48 కిలోమీటర్లు. అంతర్జాతీయ గూడ్స్ రైలు స్పీడు 115 కిలోమీటర్లు.. మనదేశంలో సగటు స్పీడు 57 కిలోమీటర్లు. అంతర్జాతీయ స్థాయికి పెరగాలని అడుగుతున్నాం.. తప్పా? అమెరికాతో పోటీ పడే గొప్ప ఆర్థికశక్తి, వనరులు, యువత దేశంలో ఉన్నది. వాటన్నింటినీ సమ్మిళతం చేసి, దేశాన్ని ముందుకు నడిపించే కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.. తప్పా? చైనాతో సమానంగా ఎదగాలనుకుంటున్నా.. వద్దా? దాని కోసం కొత్త రాజ్యాంగం రావాలని మరోసారి ప్రతిపాదిస్తున్న. దీనిపై చర్చపెట్టండి.
నయా పంథాలో..
తెలంగాణ వస్తే మనం బాగుపడుతం అని ఉద్యమ సమయంలో నేను చెప్పిన..ఇవాళ ఏం జరుగుతున్నది? అభివృద్ధిలో తెలంగాణ ఎక్కడున్నదో కనవడతలేదా? నాడు ప్లానింగ్ కమిషన్ జాబితాలో తెలంగాణలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనకబడి ఉండేవి. ఇవ్వాల తెలంగాణ జిల్లాలు ఎట్లా ప్రగతి సాధిస్తున్నయ్? విద్యుత్తు తలసరి వినియోగంలో ముందంజలో ఉన్నది. దేశవ్యాప్తంగా 10 స్వచ్ఛ గ్రామాలను ఎంపిక చేస్తే అందులో 7 తెలంగాణ పల్లెలే ఉన్నయ్. తెలంగాణ మాదిరిగా దేశం పరివర్తన చెందడానికి, నయా ప్రగతి పంథాలో ముందుకు వెళ్లేందుకు కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.
చైనా, సింగపూర్ మోడల్లో అభివృద్ధి కావాలంటే..
రాజ్యాంగం మార్చాలనే అంశంపై దేశంలో చర్చ జరగాలని చెప్పాను. చర్చ మొదలైంది. రాజ్యాంగం మార్పు అనే దానిమీద పెద్ద కథ ఉన్నది. చిన్న విషయం కాదు. నేను అంత అమాయకుడిని కాదు కదా! ఆలోచించకుండానే, చదవకుండానే మార్చాలని చెప్తానా? ఇన్నేండ్ల రాజకీయ జీవితం పెట్టుకొని అంత ఈజీగా చెప్తమా? సందర్భాన్ని బట్టి వస్తది కదా. దేశం అనుకున్న పద్దతిలో చైనా మోడల్లో, సింగపూర్ మోడల్లో ఇంకా పైకి వచ్చి అభ్యుదయ పథంలో ముందుకు సాగుతున్న మోడల్లో పోవాలంటే దేశంలో పరివర్తన రావాలి. కొత్త ఆలోచన, కొత్త దృక్పథంతో పురోగమించాల్సిందే. అప్పుడే ఈ దేశం ఆశించిన ప్రగతి సాధిస్తుంది.
ప్రజలే మార్పు తేగలరు
2019 ఎన్నికలకు ముందు ఒక రాజకీయ నాయకుడిగా నా ప్రయత్నాలు చేశాను, బోలెడు మందిని కలిశాను. ఎంతో అధ్యయనం చేశాం, సమాచారం సేకరించాం, కేశవరావు కూడా నాతో ఉన్నారు. కానీ, పరిస్థితులు మేము అనుకున్నట్టు జరుగలేదు. మళ్లీ బీజేపీ పవర్లోకి వచ్చింది. కానీ బీజేపీ పాలనలో రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. దేశంలో మత విద్వేషాలు పెరిగి పోతున్నాయి. ఇది ఊహించింది కాదు. ఎవ్వరూ కోరుకున్నది కాదు. ఇది దేశానికి మంచిది కాదు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిస్తున్నా. దేశంలో ఏ పెద్ద మార్పు రావాలన్నా ప్రజలే ముందుకు రావాలి. ప్రజలంతా కోరుకొని చేసిన పోరాటం ఫలితంగా తెలంగాణ సాధ్యమైంది. ఇప్పుడు దేశ ప్రజలు కూడా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. విధానాలు విధానాలే, ప్రోటోకాల్ ప్రోటోకాలే. హైదరాబాద్లో ప్రధాని మోదీ కార్యక్రమంలో నేను పాల్గొనక పోవడానికి ప్రధాన కారణం మా ఇంట్లో ఇద్దరికి కరోనా వచ్చింది. అందుకే వెళ్లలేకపోయాను. ఆ సమయంలో ప్రధానిని కలువడం మంచిది కాదని పోలేదు అని సీఎం కేసీఆర్ తెలిపారు.
చంద్రబాబు జై తెలంగాణ అనలేదా?
దేశంలోని అన్ని రాజకీయ శక్తులు ఏకమై బీజేపీని తరిమికొట్టాలి. భవిష్యత్తు రాజకీయాలను ఊహించి చెప్పలేం. బీజేపీ అరాచక పాలనపై దేశమంతా చర్చ జరగాలి. దేశం కోసం ముందు కదలాల్సింది ప్రజలే. జనం ప్రభంజనమైతే ఎవరూ అడ్డుకోలేరు. తెలంగాణ కోసం నేను ఉద్యమం ప్రారంభించిన నాడు మేమొక పంథా వేసుకున్నం. వ్యక్తులను, గ్రూపులను, పార్టీని పరిగణనలోకి తీసుకోలె. ప్రజలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నం. ప్రజాకదలిక వచ్చిన నాడు పార్టీలు, నాయకులు మోకాళ్లపై కూర్చుని జనంవెంట ఉరుకుతరు. దానికి మీరు, నేనే సాక్ష్యం. సమైక్యవాదినని చెప్పిన చంద్రబాబునాయుడు జై తెలంగాణ అనలేదా? సీపీఐ అనలేదా? ఇంకా ఎన్నో పార్టీలు అనలేదా? ఎందుకంటే జనం కదిలారు కాబట్టి. ఇప్పుడు కూడా దేశంలో కదలాల్సింది ప్రజలు. కదిలించవలసింది ప్రజల్ని. పార్టీలను, నాయకులను కాదు. ఆ ప్రయత్నం ప్రారంభమైంది. నేను ఊరికే చెప్తులేను. నా లెక్కలు నాకున్నయ్.
ఏదీ అంబ్కేదర్ స్ఫూర్తి?
రాజ్యాంగం మార్పు అనగానే కొన్ని దళిత సంఘాలు ఏవేవో మాట్లాడుతున్నయ్. అంబేద్కర్పై దళితసంఘాలు ఏమైనా పేటెంట్ తీసుకున్నయా? రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేసుకోవాలి. అలా జరగకపోతే తానే రాజ్యాంగాన్ని కాలబెడతా అన్న మహనీయుడు అంబేద్కర్. అవసరమైతే మార్చుకోవాలని కూడా చెప్పిండు. రాజ్యాంగాన్ని అమలుచేసేటోడు మంచోడు కావాలన్నడు. అంబేద్కర్ పేరు చెప్పుకొని బతుకుడు కాదు, ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి. నేను అడుగుతున్నా.. దేశంలో ఇవాళ అంబేద్కర్ స్ఫూర్తి ఉన్నదా? ఆ స్పిరిట్ ఉంటే దేశంలో దళితజాతి ఎందుకు అణగారి ఉన్నది? ఇన్నేండ్ల తరువాత తెలంగాణ ఎందుకు దళితబంధు పెట్టాల్సి వచ్చింది? దళితులు ఎందుకు ఆక్రోశిస్తున్నరు?
అహింసాయుతంగానే..
దేశంలో పరివర్తన..అహింసాయుతంగా, శాంతియుతంగా ఉండాలి. ప్రజలను చైతన్యవంతం చేసేవిధంగా ఉండాలి. ప్రజాశక్తిని కూడదీసేలా ఉండాలి. బోధించు, సమీకరించు, పోరాడు అని అంబేద్కర్ సూచించారు. అదే మార్గంలో మేం పయనిస్తున్నాం. మమత్మాగాంధీ అహింసా పద్ధతిలోనే మనకు స్వాతంత్య్రం తెచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఓపికతో అర్థం చేసుకుంటే.. గాంధీతోపాటు సుభాష్ చంద్రబోస్ హీరోలా పోరాడారు. సుభాష్ చంద్రబోస్ మిలిటరీ ద్వారా స్వాతంత్య్రం కోసం పోరాడారు. జర్నలిస్టులు చంద్రబోస్ను అడిగితే.. తాను సైతం గాంధీ మార్గంలోనే పోరాడుతున్నానని, గాంధీ అనుసరించిన అహింసామార్గం విఫలమైతే తాను గన్స్తో సిద్ధంగా ఉంటానన్నారు. ఇదే స్పిరిట్ దేశంలో కొనసాగుతుంది.