ముషీరాబాద్, నవంబర్ 29: మాదిగల చిరకాల కోరిక, న్యాయమైన డిమాండ్ అయిన ఎస్సీల వర్గీకరణ సమస్యను పరిష్కరించకుండా మోసం చేసిన బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. సోమవారం విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకణ కోసం 28 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీ ఓట్ల కోసం మాదిగలను వాడుకొని మోసం చేశాయని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని 2014 ఎన్నికల్లో బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెఫ్టోలో ప్రకటించిందని, ఆ తర్వాత వర్గీకరణ ఊసెత్తలేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అనేక సభల్లో వర్గీకరణ హామీ ఇచ్చి ఇప్పుడు ఆ మాటెత్తడం లేదని, పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణపై బీజేపీ తీరును ఎండగడుతూ డిసెంబర్ 1న నిర్వహించే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు.