హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి స్వర్ణయుగం వచ్చిందని, ఆయన దూరదృష్టి వల్లే రైతులు దర్జాగా జీవిస్తున్నారని సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటివి రైతుల స్థితిగతులను మార్చాయని అన్నారు. ప్రస్తుతం ఈ పథకాలు దేశానికి మాడల్గా మారాయని, సీఎం కేసీఆర్ అమలు చేసే ప్రతి పథకం వెనుక పేదల బాధలు తొలగించే ఉద్దేశం ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, తర్వాత గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని ప్రజలను కోరారు. సరిహద్దు రాష్ర్టాల ప్రజలు తెలంగాణలో కలుస్తామని కోరుకొంటున్నట్టు చెప్పారు. దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని, మనఊరు-మనబడి ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారాయని వివరించారు. ఒకప్పుడు కరువు, వలసలకు నిలయమైన తెలంగాణ.. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని, తెలంగాణ వస్తే ఏం వస్తుందన్న వారికి ఈ అభివృద్ధే సమాధానమని సూచించారు. తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదనే నానుడి వాడుకలోకి వచ్చిందని అన్నారు. కంటివెలుగు పథకాన్ని పంజాబ్, ఢిల్లీలోనూ అమలు చేస్తామని ఆ రాష్ర్టాల ముఖ్యమంత్రులు చెప్పడం దేశ ప్రగతిపై తెలంగాణ ముద్రకు నిదర్శనమని పేర్కొన్నారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, లేకుంటే దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని క్షమించరని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచేలా చట్టం చేయాలని సండ్ర కేంద్రాన్ని డిమాండ్ చేశారు.