Minister KTR | బీజేపీ, కాంగ్రెస్ దశాబ్దాలుగా దేశాన్ని నాశనం చేశాయి. వాళ్ల అసమర్థతను బయటికి రాకుండా దాచేశాయి. కానీ ఇది సోషల్ మీడియా యుగం. వారి బాగోతం ప్రజలకు తెలిసిపోయింది. అందుకే.. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే మాకు అవకాశం. వీలైనన్ని ఎక్కువ పార్లమెంట్ స్థానాల్లో పాగా వేయడానికి సన్నద్ధం అవుతున్నాం.
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోనూ, దేశంలోనూ బీజేపీతో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నదని బీఆర్ఎస్ పార్టీయేనని, తాము చేసిన మంచిపనులే తమను గెలిపిస్తాయని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లలో బీఆర్ఎస్ విజయం ఖాయమని తెలిపారు. సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని నాశనం చేశాయని విమర్శించారు. ఇప్పుడు దేశానికి తెలంగాణ మాడల్ అత్యవసరమని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ఇటీవల కేంద్ర మంత్రులను కలిశానని, వారిని గతంలోనూ పదుల సార్లు కలిసి నిధు లు ఇవ్వాలని కోరానని చెప్పారు. దానికే బీజేపీతో కలిసిపోయినట్టు కాదని స్పష్టంచేశారు. ఢిల్లీలో పీటీఐ వా ర్తా సంస్థకు కేటీఆర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇప్పుడే కాదు.. గతంలోనూ అదే మంత్రులను పదులసార్లు కలిశాను. గతంలో కలవలేదని, ఇప్పుడే హఠాత్తుగా కలిశామనడం తప్పు. రాష్ట్రంలో మేం ప్రభుత్వంలో ఉన్నాం. ఢిల్లీలో బీజేపీది ప్రభుత్వం. మేము సైద్ధాంతికంగా, రాజకీయంగా బీజేపీతో విభేదిస్తున్నాం. అలా అని మేం ప్రజలకు సేవ చేయడం మానేస్తామని కాదు. రాష్ట్ర ప్రజల సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చించాలి. అందుకే వారిని కలిశాం. వాళ్లు మంచి చేస్తే కృతజ్ఞతలు తెలుపుతాం. చేయకుంటే ప్రజలకు ఆ విషయాన్ని బయటపెడతాం. అదీగాక నేను ఇకడికి వచ్చి వారిని కలవకుంటే బీజేపీ వాళ్లు తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్ వాళ్లు ఎప్పుడూ వచ్చి కలవలేదని ప్రచారం చేస్తారు. మేం వచ్చాం. కలిశాం. సమస్యలు వివరించాం. ఇక ఏం చేస్తారనేది వారి ఇష్టం. మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.
మేము తెలంగాణ మాడల్ను సృష్టించాం. అన్ని రంగాల్లో ప్రత్యేక ముద్ర వేశాం. తెలంగాణ మాదిరిగా దేశం మొత్తం పని చేసిఉంటే ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ 4.5 ట్రిలియన్ డాలర్లు ఉండేది. తెలంగాణ టర్బో ఇంజిన్ మాదిరిగా పనిచేస్తే దురదృష్టవశాత్తు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఆ స్థాయిలో పని చేయలేకపోయాయి. అందుకే ఇప్పుడు దేశానికి తెలంగాణ మాడల్ను పరిచయం చేయబోతున్నాం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నది. దేశానికి బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయి? నేటికీ దేశంలో కోట్ల మందికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేవు. ప్రపంచంలో అనేక దేశాలకు మన తర్వాతే స్వాతంత్య్రం వచ్చింది. బాంబు దాడులు జరిగిన దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశాలన్నీ అన్ని రంగాల్లో మనకన్నా ఎంతో అభివృద్ధి చెందాయి. మన దేశాన్ని నిరుద్యోగం వెంటాడుతున్నది. రోడ్లు లేవు. తాగడానికి నీళ్లు లేవు. కరెంట్ లేదు. ఇలా చెప్పుకుం టూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటన్నింటికీ ఎవరు బాధ్యత వహించాలి? వందశాతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలదే బాధ్యత. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలే ప్రతిపక్షంగా మారారు.
ప్రతిపక్షం అంటే సరైన నిర్వచనం ఏమిటి? ప్రతిపక్షం అనేది దేశంలోని పేదరికాన్ని, నిరుద్యోగాన్ని వ్య తిరేకించాలి. తెలంగాణలో ఆ రెండూ లేవు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. తొమ్మిదేండ్లలోనే దేశానికి రోల్ మాడల్గా మారింది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.14 లక్షల నుంచి 3.17 లక్షలకు పెరిగింది. దేశంలోనే ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ. కొత్త ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందిస్తున్నాం. ఫలితంగా వ్యవసాయం 118 శాతం పెరిగింది. దేశాన్ని 75 ఏండ్లుగా పాలించిన బీజేపీ, కాంగ్రెస్.. ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాయి? దేశంలో అభివృద్ధి బీజేపీ, కాంగ్రెస్తో సాధ్యం కాదు. తెలంగాణలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుందని మేం విశ్వసిస్తున్నాం. తెలంగాణ మాడల్ను దేశమంతా అందించాలని భావిస్తున్నాం. అందుకే.. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశాలో బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తున్నాం.
దేనిని ఒక్కరోజులో నిర్మించలేం. బీజేపీ, కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అందుకే.. ఆ రెండు పార్టీలు లేని మూడో ప్రత్యామ్నాయం అవసరమని మేం భావిస్తున్నాం. ఇప్పుడు బీజేపీ 300 లకు పైగా ఎంపీ సీట్లతో ధృడంగా ఉన్నది. బీజేపీ ప్ర స్థానం కూడా రెండు పార్లమెంట్ సీట్లతోనే ప్రారంభమైంది. వెయ్యి మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. పార్లమెంట్ ఎన్నికలపై మీడియాలో హడావుడి నడుస్తుంది. కానీ మాకేమీ హడావుడి లేదు. 2024 ఎన్నికల కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నది. అప్పటి వరకు అవకాశం ఉన్నంత వరకూ మా పార్టీని విస్తరిస్తాం. వీలైనన్ని ఎక్కువ పార్లమెంట్ స్థానాల్లో పాగా వేయడానికి సన్నద్ధం అవుతున్నాం.
దేశాన్ని బీజేపీ, కాంగ్రెస్ దశాబ్దాలుగా పాలించి నాశనం చేశాయి. ఏండ్ల తరబడి వాళ్ల అసమర్థతను బయటికి రాకుండా దాచేశాయి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్నది. దేన్నీ ఎవరూ దాచలేరు. ఆ రెండు పార్టీల బాగోతం ప్రజలకు తెలిసిపోయింది. అందుకే.. ప్రజలు ఆ పార్టీలకు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే మాకు అవకాశం. తెలంగాణ మాడల్పై నమ్మకం ఉన్నది.
మరో ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి ఆలోచన లో మేం లేము. సొంతంగానే మా పార్టీని విస్తరించాలనుకుంటున్నాం. జాతీయ స్థాయిలో ఎదగాలన్నదే మా పార్టీ ఆకాంక్ష. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పోరాటం చేయాల్సి ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు చాలా పార్టీలు ఈ పరిస్థితిలో లేవు. ఒకర్ని కూల్చాలి, మరొకర్ని గద్దె ఎక్కించాలనేదే పార్టీల ఎజెండా కాకూడదు. దేశంలో అవసరమైన కనీస మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఏం చేయాలనేదానిపై ప్రతి పార్టీ ప్రాథమిక ఎజెండా ఉండాలి.
బీఆర్ఎస్ను జాతీయ పార్టీగా నమోదు చేసుకున్నాం. వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మేము ఆ ఒక్క అడుగుతో ప్రారంభించాం. తెలంగాణలో మేము చేయగలిగినం తా చేశాం. రాష్ట్రంలో మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తాం. దేశవ్యాప్తంగా మా పార్టీ విస్తరణకు మా నాయకుడు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. తెలంగాణ మా డల్ను దేశవ్యాప్తం చేయడానికి ముందుకు కదిలారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు వస్తాయా? అని ఇప్పుడు మీరు నన్ను అడుగొచ్చు.. ఇందుకు నా సమాధానం కాదు అనే చెప్తాను. కానీ ఆ ఎన్నికల్లో కచ్చితంగా మంచి సంఖ్యలో స్థానాలను గెలుచుకుంటాం. మేము కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో కీలకంగా మారుతామనే విషయాన్ని మాత్రం గట్టిగా చెప్పగలను.
కచ్చితంగా ఉంది. మాది జాతీయ పార్టీ అయినప్పుడు ఎందుకు ప్రణాళిక ఉండదు? ఇప్పటికే మా నాయకుడు కేసీఆర్ మహారాష్ట్రలో నాలుగు బహిరంగ సభలు నిర్వహించారు. ఆ సభలన్నీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. క్రమంగా మా పార్టీని విస్తరిస్తున్నాం. మహారాష్ట్రలో జడ్పీ ఎన్నికల కోసం చూస్తున్నాము. ఆ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మేం ఎలాంటి ప్రభావం చూపుతామో మీరే చూస్తారు.
ప్రజలు రెండు విషయాలను చూస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎవరు మెరుగైన పరిపాలన అందించగలరనే అంశాన్ని పరిశీలిస్తారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్కు ప్రత్యామ్నాయం లేదు. ఇక రెండోది.. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల పాలనతో పోల్చి చూస్తారు. ఆ రెండు పార్టీలు 20కిపైగా రాష్ట్రాల్ల్లో అధికారంలో ఉన్నాయి. వారి పాలనలోని ఒక్క రాష్ట్రంలో అయినా తెలంగాణ మాడల్ వంటి అభివృద్ధిని చూపించగలరా?
మేం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. ప్రజ ల్లో వ్యతిరేకత కాదు.. ఎంతో సానుకూలత మాపై ఉన్నది. ప్రో-ఇంక్యుబెన్సీని చూడండి. బీఆర్ఎస్ చేసి న పనులతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు తెలంగాణలోని 32 జిల్లా పరిషత్లలో 32 మా దగ్గరే ఉన్నాయి. 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 136 మావే. 12,769 గ్రామ పంచాయతీల్లో 9,000 పైగా మావారే ఉన్నారు. ఇలా చెప్పుకుంటే మా జాబితా చాలా పెద్దది. అద్భుతమైన ప్రేమ, ప్రజల మద్దతు వల్లే అది సాధ్యమైంది.
కాంగ్రెస్కు ఉన్న ఈ స్వల్ప ప్రజామద్దతును కూడా కోల్పోవడానికి షర్మిల ఒక్కరు చాలు. అది చాలా పెద్ద అంశం అవుతుంది. ఎందుకంటే షర్మిల, ఆమె తండ్రి గురించి మనందరికీ తెలుసు. తెలంగాణ ఏర్పాటును ఆ కుటుంబం వ్యతిరేకించింది. ప్రజలెవరూ దీనిని మరచిపోరు. తెలంగాణలో వారికి ఓటు వేయ డం ఒక జోక్. ఆమెను చేర్చుకునేందుకు కాంగ్రెస్ అంగీకరించడం పెద్ద జోక్. కాంగ్రెస్కే షర్మిల పెద్ద విపత్తు.
అదంతా అసత్యం. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి 126 అవార్డులను గెలుచుకున్నాం. ఇది స్వచ్ఛ సర్వేక్షణ్లో రెండో అతిపెద్ద సంఖ్య. మేము గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాం. రెండో స్థాయి నగరాలపై దృష్టి పెట్టాం. రాష్ట్రంలోని ఐదు నగరాల్లో ఐటీ హబ్లను ఏర్పాటుచేశాం. ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. రాష్ట్రం ఎదుగుతున్నది. ఐటీ రంగంలో కర్ణాటకకు తెలంగాణ గట్టి పోటీ ఇస్తున్నది. మరింత వృద్ధి చెందడానికి చర్యలు తీసుకొంటున్నాం. గత 2 సంవత్సరాల్లో హైదరాబాద్లో 4,50,000 కొత్త టెక్ ఉద్యోగాలు కల్పిస్తే, బెంగళూరులో 1,46,000 ఉద్యోగాలు మాత్రమే సృష్టి జరిగింది. ఈ ఏడాది దేశంలో వచ్చిన మొత్తం ఉద్యోగాల్లో హైదరాబాద్ నుంచే 44 శాతం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉపాధి కల్పనలో అగ్రగామిగా ఉన్నాం. సాఫ్ట్వేర్ ఎగుమతుల విషయానికొస్తే మన సంఖ్య 2014లో రూ. 56,000 కోట్ల నుంచి ఇప్పుడు రూ. 2.41 లక్షల కోట్లకు పెరిగింది. మా పెరుగుదల ఎంతో దూకుడుగా కొనసాగుతున్నది. ఇంకా అభివృద్ధి చెందాలి.
మొత్తం 119 సీట్లలో 90-100 సీట్లు గెలుస్తాం, గతసారి 88 సీట్లు గెలిచాం. ఈసారి, మేము కచ్చితంగా 90-100 మధ్య సీట్లను పక్కాగా గెలుస్తాం.
గుజరాత్ మాడల్ గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఎందుకంటే.. అదంతా బక్వాస్ మాడల్ అని దేశానికి తెలిసిపోయింది. ప్రస్తుతం గుజరాత్లో పవర్ హాలిడేలు నడుస్తున్నాయి. పరిశ్రమలు మూత పడుతున్నాయి. అందుకే.. నేను గోల్మాల్ గుజరాత్ మాడల్ గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు. దేశమంతా ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణ మాడల్ గురించి చెప్పాలనుకొంటున్నాను. అందరినీ కలుపుకొని వెళ్లడం, సంపూర్ణంగా, సమగ్రంగా, సమతుల్యంగా ఉండడం తెలంగాణ మాడల్. దేశంలో తెలంగాణ జనాభా 3 శాతం కంటే తక్కువ. కానీ.. జాతీయ స్థాయిలో పంచాయతీలు, మున్సిపాలిటీలు, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులన్నీ తెలంగాణకే క్యూ కడుతున్నాయి. మొత్తం అవార్డుల్లో 30 శాతం తెలంగాణకే వచ్చాయి. తెలంగాణలో రూరల్, అర్బన్ డెవలప్మెంట్ను బ్యాలెన్స్ చేస్తున్నాం. గ్రీన్ కవర్ 7.7 శాతం పెరిగింది. అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సుమారు 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రత్యక్షంగా 2.3 మిలియన్ ఉద్యోగాలు వచ్చాయి. కంపెనీల కోసం 23 వేలకంటే ఎక్కువ అనుమతులు ఇచ్చాం. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో తెలంగాణది రెండో స్థానం. తలసరి ఆదాయంలో నంబర్ వన్. తలసరి విద్యుత్తు వినియోగంలో నంబర్ వన్. గ్రీన్ కవర్ పెంచడంలో నంబర్ వన్. ఉద్యోగ కల్పనలో నంబర్ వన్. రెండేండ్లలో బెంగళూరును అధిగమించి ఐటీ ఉద్యోగాలు సృష్టించాం. ఇదీ తెలంగాణ మాడల్.
మంచి పనికి ప్రత్యామ్నాయం లేదు. మేము పేద, మధ్యతరగతి, వ్యాపార వర్గాలకు ప్రోత్సాహం అం దించాం. కేసీఆర్ ప్రభుత్వం నుంచి ప్రతీ ఒక పౌరు డు ఏదో ఒక రూపంలో లబ్ధి పొందారని నేను గర్వం గా చెప్పగలను. ఈ సుపరిపాలన మాడల్ గొప్ప ఫలితాలను ఇస్తుందని నేను చాలా నమ్మకంగా ఉన్నాను. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారు. దక్షిణాదిలో అది సాధించే మొదటి సీఎం ఆయనే అవుతారు.