Rakesh Tikait | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ)/ఆర్మూర్: తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోలు, ఉచిత విద్యుత్తు వంటి రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని వివిధ రాష్ర్టాల రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గురువారం బెంగళూరులో కర్ణాటక సంయుక్త రాజ్య రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ పథకాలపై ప్రధానంగా చర్చించారు. పథకాల అమలు తీరును, రైతులకు కలుగుతున్న లాభాలను తెలంగాణకు చెందిన రైతు నేత కోటపాటి నరసింహనాయుడు వారికి వివరించారు. అనంతరం పలువురు రైతు సంఘాల నేతలు స్పందిస్తూ.. తెలంగాణ మాడల్ రైతు పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని నొక్కిచెప్పారు. ఇందుకోసం అన్ని రాష్ర్టాల్లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఆదర్శం
స్వయంగా తెలంగాణలో పర్యటించి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఈ పథకాలపై చర్చించానని జాతీయ రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ తెలిపారు. ఇప్పటికే ఐదేండ్లలో రూ.73 వేల కోట్లు రైతుబంధు , రెండు లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టులు, లక్ష కోట్లు ఉచిత విద్యుత్తు కోసం కేటాయించడం గొప్ప విషయమని చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. త్వరలో ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి సంయుక్త కిసాన్ మోర్చాలో కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు. భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు, దానివల్ల భారత రైతాంగం ఎదురోబోయే ముప్పు గుర్తించి వక్తలు వివరించారు. సమావేశంలో ప్రొఫెసర్లు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు.