హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నదని మహారాష్ట్రకు చెందిన రైతులు, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు ప్రశంసించారు. తెలంగాణ మాడల్ను కేవలం మహారాష్ట్ర మాత్రమే కాకుండా యావత్తు దేశం కోరుకొంటున్నదని చెప్పారు. దేశానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం అవసరమని అన్నారు. గురువారం పలువురు మహారాష్ట్ర రైతులు, వివిధ సంఘాల ప్రతినిధులు డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ను కలిసినప్పుడు ఆయనలో తాము ఈ దేశపు రైతు శ్రేయోరాజ్యాన్ని దర్శించామని కుల్దీప్ కరిపే అనే రైతు నాయకుడు పేర్కొన్నారు. కేసీఆర్ తక్కువ సమయంలోనే తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలబెట్టారని కొనియాడారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేసి, సచివాలయానికి ఆ మహనీయుడి పేరు పెట్టిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయ నాయకుల్లో కలికితురాయిగా నిలుస్తారని ప్రశంసించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, అందులో భాగమే దళితబంధు పథకమని అన్నారు.
మహారాష్ట్రలో ఇప్పటివరకు ప్రజల జీవితాలను మార్చాలన్న తపనతో ఏ ప్రభుత్వమూ పనిచేయలేదని, రాష్ట్రంలో అనేక నదులున్నా సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు సౌకర్యం లేకపోవటం వల్ల రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించి, రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను దేశ రైతాంగానికి వెలుగురేఖగా నిలిపారని శ్లాఘించారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో తెలంగాణ మహిళల తాగునీటి కష్టాలను తీర్చారని చెప్పారు.
బీజేపీ ఊదరగొడుతున్న గుజరాత్ మాడల్ అసలు మాడలే కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ మాడల్ దేశానికి అనివార్యమని తెలిపారు. దళితుల ఆత్మగౌరవాన్ని దళితబంధు పథకం పెంచిందని న్యాయవాది రాంభీమ్రావ్ పాటిల్ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో కూడా అమలు చేసేందుకు అక్కడ బీఆర్ఎస్ను అధికారంలోకి తేవాలన్న ఆకాంక్ష మహారాష్ట్ర ప్రజల్లో బలంగా విస్తరిస్తున్నదని చెప్పారు. 10 ఏండ్ల క్రితం ప్రధాని మోదీ ఇచ్చిన సబ్ కా సాత్.. సబ్కా వికాస్ నినాదం మిథ్య అని తేలిపోయిందని, దేశ ప్రజలను మోదీ మోసం చేశారని ఆరోపించారు.
దేశ ఆర్థిక వ్యవస్థ రైతులపై ఆధారపడి ఉన్నా, రైతులను మోదీ సర్కార్ నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. 2024లో మహారాష్ట్రలో ఏర్పాటయ్యేది బీఆర్ఎస్ సర్కారేనని సోషల్ ఆంథ్రోపాలజిస్ట్ వినోద్ మోతే తేల్చిచెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నదని చెప్పారు. అంతకుముందు గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ను సందర్శించారు.