సీఎం కేసీఆర్, మంత్రుల సంతాపం
స్టేషన్ ఘన్పూర్/హైదరాబాద్, మార్చి 30: వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మి (87) అనారోగ్యంతో హనుమకొండలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మరణించారు. గురువారం మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి తదితరులు లక్ష్మి భౌతికకాయానికి నివాళులర్పించారు.
సీఎం కేసీఆర్ సంతాపం
ఎమ్మెల్యే రాజయ్య మాతృమూర్తి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. రాజయ్యను ఫోన్ ద్వారా పరామర్శించి, ఓదార్చారు. రాజయ్య కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
స్పీకర్, మంత్రుల సంతాపం
తాటికొండ లక్ష్మి మరణం బాధాకరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.