హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తెలంగాణ కారం నంబర్వన్గా నిలిచింది. మిర్చి ఉత్పత్తిలో మన రాష్ట్రం అగ్రభాగాన చేరింది. 2021-22 సంవత్సరంలో 6.51 లక్షల టన్నుల ఉత్పత్తితో తెలంగాణ టాప్లో నిలిచింది. మిర్చికి ఏపీలోని గుంటూరు ఫేమస్.. అలాంటి గుంటూరును వెనక్కి నెట్టిన ఖమ్మం జిల్లా తొలిసారిగా మొదటిస్థానం కైవసం చేసుకోవడం విశేషం. దీంతోపాటు ఖమ్మం జిల్లాలో ఉత్పత్తి అయ్యే మిర్చికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొన్నది. మిర్చి ఉత్పత్తి, ఎగుమతిపై బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పరిశ్రమశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. దేశం నుంచి మిర్చి ఎగుమతులు భారీగా పెరిగినట్టు చెప్పారు. 2017-18లో 4.43 లక్షల టన్నుల నుంచి 2021-22లో 5.57 లక్షల టన్నులకు పెరిగిందని వివరించారు.
రాష్ట్రంలో పెరిగిన మిర్చి ఉత్పత్తి
తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో మిర్చి ఉత్పత్తి భారీగా పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. 2014-15లో రాష్ట్రంలో 2.53 లక్షల టన్నుల మిర్చి మాత్రమే ఉత్పత్తి అయ్యేది. ఇది 2021-22లో 6.51 లక్షల టన్నులకు పెరిగింది. అంటే ఏడేండ్లలో 4 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది. తెలంగాణ ఏర్పాటైన రెండేండ్ల తర్వాత నుంచి మిర్చి సాగులో పెరుగుదల నమోదైంది. 2016-17లో తొలిసారిగా 4.82 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైంది. ఆ తర్వాత 2020-21లో 5.36 లక్షల టన్నులు, నిరుడు రికార్డు స్థాయిలో 6.51 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి అయినట్టు కేంద్రం వెల్లడించింది.
గుంటూర్.. బలాదూర్
మిర్చి ఉత్పత్తికి కేరాఫ్గా మారిన గుంటూరు జిల్లాను ఖమ్మం జిల్లా వెనక్కి నెట్టింది. 2021-22లో గుంటూరులో 1.65 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి కాగా ఖమ్మంలో 1.86 లక్షల టన్నులు అయింది. గుంటూరులో నాలుగైదేండ్ల నుంచి మిర్చి ఉత్పత్తి క్రమంగా పడిపోతుండగా, ఖమ్మంలో మాత్రం పెరుగుతూ ఉన్నది. 2014-15లో గుంటూరు 4.08 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, ఇది 1.65 లక్షల టన్నులకు పడిపోయింది. అదే సమయంలో ఖమ్మంలో 2014-15లో 1.14 లక్షల టన్నులు గల మిర్చి ఉత్పత్తి ప్రస్తుతం 1.86 లక్షల టన్నులకు పెరిగింది.
ఖమ్మం మిర్చికి అంతర్జాతీయ డిమాండ్
ఖమ్మంలో ఉత్పత్తి అయ్యే తేజ రకం మిర్చికి అంతర్జాతీయ డిమాండ్ ఉన్నది. రంగు, కారం అధికంగా ఉండటంతో దీన్ని కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం మిర్చి చెన్నై పోర్టు నుంచి చైనా, బంగ్లాదేశ్తోపాటు ఇతర ఏషియా దేశాలకు ఎగుమతి అవుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. దేశం నుంచి మిర్చి ఎగుమతులు పెరిగినట్టు కేంద్రం తెలిపింది. 2017-18లో 4.43 లక్షల టన్నుల నుంచి 2021-22లో 5.57 లక్షల టన్నులకు ఎగుమతులు పెరిగినట్టు కేంద్రం పేర్కొన్నది.