TG Ministers : వరద ప్రవాహం పెరగడంతో మంగళవారం నాగార్జున సాగర్ గేట్లను ఎత్తారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు గేట్లను తెరిచారు. మొత్తం 14 గేట్లను 5 అడుగుల మేర ఓపెన్ చేశారు. అయితే సాగర్ గేట్లను ఎత్తడానికి ముందు బేగంపేట ఎయిర్పోర్టులో మంత్రుల గొడవపడ్డారు.
షెడ్యూల్ ప్రకారం నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా మంగళవారం ఉదయం 10 గంటలకు నాగార్జున సాగర్ గేట్లను తెరువాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు అందరూ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్లో నాగార్జునసాగర్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్న ప్రకారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కానీ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గంట ఆలస్యంగా 10 గంటలకు వచ్చారు. ఈ విషయంలో కోమటిరెడ్డికి, ఉత్తమ్కు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తాను నాగార్జునసాగర్కు రానని అలిగి బేగంపేట ఎయిర్పోర్టు నుంచి వెళ్లిపోయారు.
దాంతో మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ మాత్రమే హెలికాప్టర్లో నాగార్జునసాగర్కు వెళ్లారు. పూజా కార్యక్రమం నిర్వహించి సాగర్ 14 గేట్లను ఎత్తారు. దాంతో కృష్ణమ్మ దిగువకు పరవళ్లు తొక్కుతూ పరుగులు తీస్తోంది. కాగా నాగార్జునసాగర్ జూలై నెలలో ఈ స్థాయిలో నిండటం గడిచిన 18 ఏళ్లలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.