సిద్దిపేట, జనవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పంటలకు మద్దతు ధర కోసం ధర్నాచేసిన రైతులను పిట్టల్లా కాల్చి చంపిన నరహంతక చరిత్ర మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. 2017 మే 6న మన్సాఫ్ జిల్లాలో రైతులు ధర్నా చేస్తుంటే, ఆరుగురిని కాల్చి చంపిన దుర్మార్గాన్ని గుర్తుచేశారు. శనివారం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మీరు నరహంతకులు.. మీరా వచ్చి మాకు 10వ సుద్దులు, నీతులు చేప్పేది? కేంద్రంలో నల్లచట్టాలు తెచ్చి, 750 మంది రైతులను పొట్టన బెట్టుకున్న చరిత్ర బీజేపీది’ అని విమర్శించారు. తెలంగాణకు వచ్చి అవకాకులు, చవాకులు పేలిన శివరాజ్సింగ్ చౌహాన్ వ్యవహారం వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాకాహారిని అని అన్నట్టుగా ఉన్నదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రజల ఛీత్కారానికి, తిరస్కారానికి గురై, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి, దొడ్డదారిన ముఖ్యమంత్రి అయిన చౌహాన్కు.. రాదనుకొన్న తెలంగాణను సాధించిన కేసీఆర్ను విమర్శించే నైతికహక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రాణత్యాగానికి సిద్ధపడి, ప్రజలను ఏకోన్ముఖులనుచేసి, తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి చౌహాన్ మాట్లాడటం సూర్యుడి మీద ఉమ్మేయడం లాంటిదేనని పేర్కొన్నారు. ‘అయ్యా.. చౌహాన్గారూ.. నాలుగు సార్లు సీఎం అయ్యానని చెప్తున్నావే.. నీ రాష్ట్రంలో ఏం సాధించావు.. ప్రజలను వలస కూలీలుగా మార్చినావు.. కేసీఆర్ ఏడేండ్లలో వలస కూలీలను వాపస్ తీసుకొచ్చిండు..’ అని పేర్కొన్నారు. వలసల జిల్లాగా ఉన్న పాలమూరు ఆకుపచ్చగా మారిందని, కర్నూలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నారని చెప్పారు. విద్యుత్తు, సాగునీరు, తాగునీరు, జీడీపీల్లో తెలంగాణను సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దిన విషయాన్ని కేంద్ర మంత్రులే పార్లమెంటులో చెప్పారని హరీశ్రావు గుర్తుచేశారు.
‘మీరు ఉద్ధరించింది ఏమీలేదు.. సోయి తెచ్చుకో చౌహాన్.. రాజకీయాలకోసం మాట్లాడటం కాదు.. తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు ఇచ్చాం.. మీ రాష్ట్రంలో ఉన్నదా? రైతులకు 24 గంటల కరెంట్ను ఉచితంగా ఇస్తున్నాం.. మీరు ఇస్తున్నారా? రైతు చనిపోతే రూ.5 లక్షలు ఇస్తున్నాం.. మీ రాష్ట్రంలో ఇస్తున్నారా? ఎకరానికి రూ.10 వేల సాయం ఇస్తున్నాం.. మీరు ఇస్తున్నారా?’ అని హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు. యూపీ తర్వాత ఎక్కువ భౌగోళిక ప్రాంతమున్న మధ్యప్రదేశ్ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ ఎక్కువగా ఉన్నదని వివరించారు. తెలంగాణ జీడీపీ 9.78 లక్షల కోట్లు అయితే, మధ్యప్రదేశ్ 9.77 లక్షల కోట్లుగా ఉన్నదని తెలిపారు. మధ్యప్రదేశ్ తలసరి ఆదాయం తెలంగాణతో పోల్చుకొంటే సగం కూడా లేదని పేర్కొన్నారు. తెలంగాణలో పౌరుల తలసరి ఆదాయం 2,50,691 కోట్లు కాగా, మధ్యప్రదేశ్లో 1,09,181 కోట్లు మాత్రమేనని చెప్పారు. దేశంలో వ్యవసాయం మీద అతి ఎక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని, తమకు ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు రాలేదని పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పిన విషయాన్ని హరీశ్రావు గుర్తుచేశారు. రాజకీయాలకోసం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారని, బీజేపీకి ఒక పద్ధతి ఉండదా? అని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే విచారణ జరిపించాలని పేర్కొన్నారు. శివరాజ్సింగ్ హయాంలోనే వ్యాపమ్ కుంభకోణం జరిగిందని, అనేక మంది అదృశ్యమయ్యారని, ఎంతోమంది చనిపోయారని, అదంతా ఇప్పటికీ మిస్టరీగా ఉన్నదని విమర్శించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ నాయకులు, మంత్రులు ఉద్యోగాలను అమ్ముకొన్నారనే ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు.
‘బీజేపీ నాయకులు నడ్డా, చౌహాన్, బండి సంజయ్ తదితరులు సోయి లేకుండా జీవో 317ను రద్దుచేయాలని కోరుతున్నారని, రద్దు చేయడమంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దుచేయడమేనని హరీశ్రావు పేర్కొన్నారు. ఉద్యోగుల విభజనను అడ్డుకొని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేసి, వారిని టీఆర్ఎస్ ప్రభుత్వంపైకి ఎగదోసి, రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలకు బీజేపీ తెరలేపిందని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వొద్దా? ఖాళీల భర్తీలో స్థానికులకు అవకాశం ఇవ్వొద్దా? బీజేపీ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం 1,32,899 ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ, బురద జల్లుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క ఖాళీ కూడా లేకుండా అన్నింటినీ భర్తీ చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు.
ఉద్యోగుల విభజన జరగొద్దు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావొద్దు. వారికి టీఆర్ఎస్పైన కోపం రావాలి. వారిని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలనేది బీజేపీ కుట్ర. బీజేపీ నాయకులు ఉద్దేశం ఏమిటి? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వవద్దా? బీజేపీ కుట్రలను నిరుద్యోగ యువత అర్థం చేసుకోవాలి.
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వొద్దా?
కేంద్రంలో లక్షల ఖాళీలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడరు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బరుదజల్లుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే 1,32,899 ఉద్యోగాలు ఇచ్చింది. రాష్ట్రంలో ఒక ఖాళీ కూడా లేకుండా నింపాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లా నిరుద్యోగులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానికులకు ఇవ్వొద్దంటారా? ఏదో రకంగా కుట్రలు చేసి ఉద్యోగాల నియమాకాలను అడ్డుకోవాలని బీజేపీ చూస్తున్నది.
–మంత్రి హరీశ్రావు
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానం ఏమైందో చెప్పాలని బీజేపీకి మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు అయిందని, 14 కోట్ల ఉద్యోగాలకు లెక్కచెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగంపై నడ్డా, బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15,62,912 ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో 25 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను బీజేపీ మోసం చేసిందని, ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతున్నదని మండిపడ్డారు. బీఎస్ఎన్ఎల్లో 50 వేల ఉద్యోగాలను ఊడగొట్టారని వివరించారు. ఎయిర్ ఇండియా, బీపీసీఎల్, ఐవోసీఎల్ను అమ్మకానికి పెట్టారని, రైల్వేను ప్రైవేటీకరిస్తున్నారని విమర్శించారు. 2014 కంటే దేశంలో నిరుద్యోగ శాతం 5 ఉంటే 2021లో 7.9 శాతానికి పెరిగిందని వివరించారు. బీజేపీ సాధించిన ఘనత ఇదేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ శాతం 2.2 మాత్రమే ఉన్నదని తెలిపారు.
దేశం మొత్తం మీద తెలంగాణలోనే ఉద్యోగుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి హరీశ్రావు వివరించారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తెలంగాణ ఉద్యోగుల కంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వేతనాలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం 17 శాతం ఫిట్మెంట్ ఇస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం గతేడాది 43 శాతం ఇప్పుడు 30 శాతం మొత్తంగా 73 శాతం ఇచ్చిందని వివరించారు. ఇదేనా ఉద్యోగుల మీద బీజేపీకి ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు గొంతులు చించుకొని అబద్ధాలను ప్రచారంచేస్తే అవి నిజాలుగా మారవని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా తన స్థాయిని మరిచి దిక్కు మాలిన రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మిషన్ భగీరథతో చుక్కనీరు రాలేదని చెప్పడం దివాళాకోరుతనమని పేర్కొన్నారు. తెలంగాణలో ఏ ఇంట్లో నీళ్లు రావడం లేదో చెప్పాలని డిమాండ్చేశారు.జాతీయ పార్టీ నాయకులు బాధ్యతగా మాట్లాడాలని, పచ్చి అబద్ధాలు చెప్తే ప్రజలు నవ్వుకొంటారని హితవు చెప్పారు.