నమస్తే తెలంగాణ నెట్వర్క్: వ్యవసాయంలో దేశానికే మోడల్గా నిలిచిన తెలంగాణపై కేంద్రం కుట్రలను తిప్పికొడతామని, రాష్ట్ర రైతులకు న్యాయం జరిగేవరకూ పోరాటం ఆపబోమని మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, తలసాని శ్రీనివాస్యాదవ్, చామకూర మల్లారెడ్డి స్పష్టంచేశారు. శనివారం వారు ఆయా జిల్లాల్లో మాట్లాడారు. అన్ని రాష్ర్టాల్లో వడ్లు కొంటున్న కేంద్రం.. తెలంగాణ వడ్లను ఎందుకు కొనదో చెప్పాలని డిమాండ్ చేశారు. యాసంగి వడ్లు కొనకుంటే బీజేపీకి రైతుల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రైతన్నల సెగ తగిలేలా సోమవారం ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు చెప్పారు.
తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష చూపుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. రైతన్నలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. శనివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి సెగ తగిలేలా సోమవారం ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు వెల్లడించారు. బీజేపీకి రైతుల ఉసురు తగులుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిరుపేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని స్పష్టంచేశారు.
తెలంగాణ రైతులకు వెన్నుపోటు పొడిచిన బీజేపీని, ఆ పార్టీ నేతలను తరిమికొట్టాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడలో రూ.7.20 కోట్లతో చేపట్టిన సమీకృత మార్కెట్ నిర్మాణానికి శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మారిస్తే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతులు వ్యవసా యం చేయకుండా కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. దేశంలోని ఏ రాష్ట్రంలో పండనంత పంట తెలంగాణలో పండితే.. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని ధ్వజమెత్తారు.
రాష్ట్ర బీజేపీ నాయకులు తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పండి న ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనుగోలు చేయదో చెప్పాలని రాష్ట్ర బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. రైతుల కోసం టీఆర్ఎస్ పోరాడుతుంటే, బీజేపీ నేతలు రైతులకు మేలు జరగకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న రైతులు, వారి కుటుంబసభ్యులు దేశవ్యాప్తంగా తిరగబడక ముందే కేంద్రం మేల్కొనాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని 2022-23 లోపు రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ.. ఆ విషయాన్నే మరిచిపోయారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మోదీ చేసిందేమీ లేదన్నారు. పంటకు ఎమ్మెస్పీని 50% పెంచాలని, ప్రభుత్వం ప్రకటించిన ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించాలని, విత్తనాలు, ఎరువుల ధరను 50 % తగ్గించాలని డిమాండ్ చేశారు. మోదీ తీరుకు వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగాలని పిలుపునిచ్చారు.