ములుగు : మేడారం జాతరలోనూ బీజేపీ నేతలు రాజకీయాలు మాట్లాడటంపై రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్లు మండిపడ్డారు. మేడారం మహాజాతర సందర్భంగా తాము ఏనాడూ రాజకీయాలు మాట్లాడలేదని వారు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతర ఏర్పాట్లు చేసి, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
ఈ జాతరకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకురాకుండా, చుట్టుపు చూపుగా దర్శనం కోసం వచ్చి రాజకీయాలు చేస్తారా? అని మంత్రులు ధ్వజమెత్తారు. బీజేపీ నాయకుల వైఖరి కారణంగా తాము కూడా రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్ కుంభమేళాకు కేంద్రం రూ. 325 కోట్లు కేటాయించింది. మరి మేడారం జాతరకు కేవలం రూ. రెండున్నర కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇది ఆదివాసీలను అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. మినీ కుంభమేళా అయిన మేడారం జాతర ఏం పాపం చేసింది? అని నిలదీశారు. ఇంతటి గొప్ప జాతరను జాతీయ పండుగగా ఎందుకు ప్రకటించడం లేదని అడిగారు.
తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. మా గిరిజన విద్యార్థులు మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ అన్నా, తెలంగాణ ప్రజలు అన్నా మీకు లెక్కలేదు. ఇంత నిర్లక్ష్యం, వివక్ష చూపిస్తారా? అని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.