న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): వన్ నేషన్-వన్ ప్రొక్యూర్మెంట్ నినాదంతో, పంజాబ్లో మాదిరిగా తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి చేరుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం వెళ్లిన ఈ బృందంలో నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ ఉన్నారు. మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్లో మాదిరిగానే తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పీయూష్ గోయల్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాని పక్షంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన కార్యాచరణ ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అర్థరహితంగా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ వంటి నినాదాలు ఇస్తున్న కేంద్రం వన్ నేషన్-వన్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలుచేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. పంజాబ్లో మొత్తం పంటను కొంటున్న కేంద్రం తెలంగాణలో ఎందుకు కొనదని ప్రశ్నించారు. రాష్ట్ర, రైతుల అభివృద్ధికి కేంద్రం తీరు గుదిబండగా మారిందని విమర్శించారు. బాయిల్డ్ రైస్ను పరిచయం చేసిందే ఎఫ్సీఐ అని, ఇప్పుడెందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజనూ కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.