హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లోని దవాఖానల్లో అన్ని రకాల వసతులు కల్పించిందని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. అత్యవసరం అయితే తప్ప హైదరాబాద్కు రిఫర్ చేయొద్దని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గర్భిణులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కొవిడ్ సోకిన గర్భిణుల కోసం అన్ని దవాఖానల్లో ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, వార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా సోకిన ఇతర బాధితులకు అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సల కోసం కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, వార్డులు కేటాయించాలని ఆదేశించారు. మంగళవారం అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్వోలు, టీచింగ్ దవాఖానల సూపరింటెండెంట్లు, యూపీహెచ్సీ, పీహెచ్సీల వైద్యాధికారులతో మంత్రి హరీశ్రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, దవాఖానల సన్నద్ధత తదితర అంశాలను సమీక్షించారు. అన్ని ప్రభుత్వ దవాఖానలకు అసవరమైన వైద్య పరికరాలు సమకూర్చామని, గర్భిణులు, ఇతర బాధితులను అనవసరంగా ఇతర పెద్ద ప్రభుత్వ దవాఖానలకు రిఫర్ చేయవద్దని ఆదేశించారు. అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలు అవసరమైనవారికి కరోనా సోకిందనే కారణంతో చికిత్స అందించేందుకు నిరాకరించవద్దని స్పష్టంచేశారు. జిల్లా వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకొంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
కరోనా తగ్గుముఖం పట్టేవరకు రాష్ట్రంలోని బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలు, సబ్ సెంటర్లు ఆదివారం కూడా పనిచేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ప్రతి పీహెచ్సీలో రాత్రి 10 గంటలవరకు వాక్సినేషన్ చేపట్టాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీహెచ్సీలో వైద్యసిబ్బంది ఉండాలని స్పష్టంచేశారు. కొవిడ్ లక్షణాలతో ఎవరు వచ్చినా పరీక్ష చేయాలని, పాజిటివ్ వచ్చినవారికి కిట్లు ఇవ్వడంతోపాటు, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొంటూ ఉండాలని ఆదేశించారు. అవసరమైతే వారిని సమీప ప్రభుత్వ దవాఖానకు పంపాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒకరికీ రెండు డోసులు ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో డోస్ పెండింగ్లో ఉండవద్దని స్పష్టంచేశారు. బూస్టర్డోస్ను వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్లతో మాట్లాడి మున్సిపల్ సిబ్బందికి, ఎస్పీలతో మాట్లాడి పోలీసులందరికీ బూస్టర్ డోస్ వేసేలా సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్వోలకు సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.