హైదరాబాద్: భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే పీవీ నర్సింహారావుకు భారతరత్న పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించాలన్నారు.
పీవీ 18వ వర్ధంతి సందర్భంగా మంత్రి తలసాని.. పీవీ మార్గ్లోని పీవీ ఘాట్ దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడని, బహుభాషా కోవిదుడని మంత్రి గుర్తుచేసుకున్నారు. నూతన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. పీవీ శత జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఏడాదిపాటు నిర్వహించి ఆయన సేవలను స్మరించుకున్నదని తలసాని చెప్పారు.