హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు, మతాల పండగలు గొప్పగా జరుగుతున్నాయన్నారు. దీపావళి పర్వదిన సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ తన కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా దీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్లో చార్మినార్కు రావాలంటే చాలా ఇబ్బందులు ఉండేవని, కేసీఆర్ పాలనలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయాయన్నారు. ఇప్పుడు పండుగలు గొప్పగా జరుగుతున్నాయన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారిని రాష్ట్ర మంత్రిగా దర్శించుకోవడం తన అదృష్టమన్నారు.
రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఇలా ఎవరైనా తమ పండగలను గొప్పగా జరుపుకునే వాతావరణం రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పారు. తెలంగాణలో పండుగలకు పూర్వ వైభవం వచ్చిందని, ఇవాళ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు మరోసారి దీపావళి శుభాకాంక్షలు అని చెప్పారు.