Ponnam Prabhakar | ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్వవహరిస్తోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు.
పార్లమెంట్లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేశారని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఎంపీ సిఫార్సుల వల్లే నిందితులకు పాసులు వచ్చాయని, వారిని కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పొన్నం ఆరోపించారు. పార్లమెంట్.. రాజ్యాంగాన్ని అమలుచేసే వేదిక అని, అక్కడ ఘటన జరిగి వారం రోజులైనా దోషులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతున్నారు అంటూ బీజేపీ సర్కార్పై ధ్వజమెత్తారు. పార్లమెంట్ భద్రతపై విచారణ జరపాలని, ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పొన్నం డిమాండ్ చేశారు.