వేములవాడ: కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శల వర్షం గుప్పించారు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం చేసిందేమీ లేదని, ఇప్పుడు సిగ్గులేకుండా ఒక్కఛాన్స్ ఇవ్వండని అడుగుతోందని మండిపడ్డారు. తొమ్మిదిన్నరేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడంలో వివక్ష చూపిందని విమర్శించారు. వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
‘కాంగ్రెస్ హయాంల సిలిండర్ ధర పెరిగితే నరేంద్ర మోదీ లొల్లివెట్టిండు. తనను గెలిపిస్తే ధర తగ్గిస్తనని చెప్పిండు. నమ్మి ప్రజలు గెలిపించినంక ఏం జేసిండు..? సిలిండర్ ధరను ఏకంగా రూ.800 వందలకు పెంచిండు. అందుకే వాళ్ల మాటలు నమ్మొద్దు. ఈసారి బీఆర్ఎస్ గెలిచినంక సిలిండర్పై మోదీ పెంచిన భారాన్ని మేం భరిస్తాం. మీకు రూ.400 కే గ్యాస్ సిలిండర్ ఇస్తం. అందుకు నేను హామీ ఇస్తున్నా. ఇదివరకు ఏ ముఖ్యమంత్రన్నా ఆడపిల్ల లగ్గం చేసి లక్ష రూపాయలు ఇచ్చిండా..? మరె మేం కళ్యాణ లక్ష్మి ద్వారా ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.లక్ష ఇస్తున్నం. కళ్యాణ లక్ష్మి మాదిరిగానే ఇప్పుడు రాష్ట్రంల ఉన్న 13.5 లక్షల మంది ఆడబిడ్డలకు సౌభాగ్య లక్ష్మి ద్వారా పెన్షన్ ఇయ్యబోతున్నం. ఈ పథకం కింద 18 ఏండ్ల వయసు నిండిన అర్హురాలైన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ ఇస్తం’ అని మంత్రి కేటీఆర్ చెప్పారు.
‘ఆసరా పెన్షన్లను రూ.5 వేలకు పెంచబోతున్నం. అదేవిధంగా భూమి ఉన్నా లేకున్నా తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల జీవిత బీమా ఇయ్యబోతున్నం. ‘కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా’ అనే నినాదంతో కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయబోతున్నం. అంతేగాక రాష్ట్రంలోని 93 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇయ్యబోతున్నం. ఇన్ని పనులు చేసి, ఇంకా చేస్తనంటున్న కేసీఆర్ను తెలంగాణ ప్రజలు వదులుకుంటరా..? ఆలోచించండి. ఆలోచించి ఓటేయండి’ అని మంత్రి కోరారు.
‘కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్గాంధీ ఏమంటున్నడు..? దొరల పాలన కావాల్నా..? ప్రజల పాలన కావాల్నా అంటున్నడు. నిజంగానే నవంబర్ 30న జరిగే ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య పోరాటం. తెలంగాణ ప్రజల పాలననే కావాలె. ఢిల్లీ దొరలు రాహుల్గాంధీ, నరేంద్రమోదీ.. కేసీఆర్ మీద పగబట్టిండ్రు. తెలంగాణల కేసీఆర్ను మళ్ల గెలువనిస్తే ఇగ మహారాష్ట్రల జొచ్చుతడని బొణిగె పిసికేందుకు కుట్ర చేస్తున్నరు. అందుకోసం కేంద్ర మంత్రులు, వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దించుతున్నరు. ఒక్క బక్కపల్చని కేసీఆర్ను కొట్టేటందుకు ఈవిధంగా షేర్లు, షంషేర్లను తీసుకొస్తున్నరు. ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ నేతలకు చేతగాక బయటి నేతలను తెచ్చుకుంటున్నరు’ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.