బీబీ నగర్: బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా రూపొందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పార్టీ క్యాడర్కు, లీడర్లకు పిలుపునిచ్చారు. గులాబీ జెండా అంటేనే విపక్షాల గుండెల్లో గుబులు రేకిత్తించేలా ముందుకు సాగాలాని గులాబీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ పరిధిలోని బీబీనగర్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, గోలి ప్రణీతా పింగళ్ రెడ్డి, యంపీపీ సుధాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ను చూసి మోదీ & గ్యాంగ్కు భయం పట్టుకుందన్నారు. అందుకే ఎమ్మెల్సీ కవితపై కేసులు పెట్టి, మంత్రి కేటీఆర్పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రతి ఒక్కరికీ వివరించాలని మంత్రి కోరారు. ‘గులాబీ పార్టీ లేకుంటే వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ వచ్చి ఉండేదా..? వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకం అమలులోకి వచ్చేదా..? కళ్యాణాలక్ష్మి/షాదీ ముబారక్ల పేరుతో ఇంతటి పారదర్శకంగా అడపిల్లల పెండ్లిళ్లకు ఆర్థిక సాయం అందేదా..? నల్లాల దగ్గర ఎలాంటి గలాటా లేకుండా మిషన్ భగీరథ నీళ్లు అందేవా..?’ అని మంత్రి ప్రశ్నించారు.
పార్టీని పటిష్టం చేసుకోవడానికి గ్రామ సభలతో సరిసమానంగా పార్టీ సమావేశాలు నిర్వహించాలని, అలా నిర్వహించగలిగినప్పుడే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ప్రజల్లోకి వెళ్తాయని మంత్రి అన్నారు. అందుకే ఆత్మీయ సదస్సు లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సులు ఇచ్చే సందేశం ప్రజల్లోకి చేరేలా గులాబీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.