నిర్మల్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా అధికారులతో నిర్మల్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లా వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. ప్రజాప్రతినిధులందరూ సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను వేడుకగా నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను 21 రోజులపాటు ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. దశాబ్ధి ఉత్సవాలు ఊరువాడలా జరగాలని, ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని, ఆయా గ్రామాల్లో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. గ్రామగ్రామాన సభలు పెట్టాలని, ఆయా గ్రామ సభల సందర్భంగా ప్రగతి నివేదికలు చదివి ప్రజలకు వినిపించాలని కోరారు. గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని, సాధించిన విజయాలను ప్రజలు చర్చించుకునేలా ప్రదర్శనలు జరగాలని చెప్పారు.