Telangana | మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) కి పట్టిన గతే బీజేపీ( BJP )కి కూడా పడుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) హెచ్చరించారు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి( Kiran kumar reddy ) తెలంగాణకు ఏమి ఇవ్వము అని చెబితే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏం చేసుకుంటావో చేస్కో అని అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజల దెబ్బకు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఖతం అయ్యింది. ఇప్పుడు కేంద్రం కూడా అలాగే చేస్తుంది. మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాలు, నర్సింగ్ కాలేజీలు, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందన్నారు హరీశ్రావు.
మెదక్ జిల్లా శివ్వంపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు. తొమ్మిదేండ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండే..? ఇప్పుడు ఎలా ఉందో..? అనే విషయాన్ని గుండె మీద చేయి వేసి ఆలోచించాలన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ వంటి పథకాలు గతంలో ఉండేనా అని ప్రశ్నించారు. నాడు అన్నదాత ఏడుపు.. ఆకలి కేకలు వినిపించేవి. ఇప్పుడు అవి లేకుండా చేశామన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు చేయని పనులు గులాబీ జెండా చేసిందని స్పష్టం చేశారు.
నెత్తి లేనొడు, కత్తి లేనొడు నత్తి నత్తిగా మాట్లాడుతాడు అని విపక్షాలపై హరీశ్రావు ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో లేని పథకాలు అనేకం అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాల కోసం పని చేస్తున్నామని స్పష్టం చేశారు. అదానీ ఆస్తిని బీజేపీ పెంచితే, ప్రజల ఆస్తిని కేసీఆర్ పెంచారని గుర్తు చేశారు. పెంచుడు బీజేపీ వంతు అయితే.. పంచుడు కేసీఆర్ వంతు అని పేర్కొన్నారు. కేసీఆర్ రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచాడని తెలిపారు. బీజేపీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. హక్కుగా రావాల్సినవి కూడా ఇవ్వడం లేదని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.