హైదరాబాద్: మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఖమ్మం, కరీంనగర్కు మెడికల్ కాలేజీలు ఇవ్వమని కేంద్రం చెప్పడంపై ఆయన మండిపడ్డారు. తమకు మెడికల్ కాలేజీలు ఇవ్వమని చెప్పిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో కరీంనగర్, ఖమ్మం ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తారని అన్నారు.
కేంద్ర బడ్జెట్లో ఉన్నదేమీ లేదని, అంతా డొల్ల అని హరీష్రావు ఎద్దేవా చేశారు. పేదల మేలుకు సంబంధించిన ఒక్క అంశం కూడా కేంద్ర బడ్జెట్లో లేదన్నారు. పైగా కార్పోరేట్లకు పన్నులు తగ్గించారని విమర్శించారు. రైతుల గురించిగానీ, మహిళల గురించిగానీ, వృత్తుల గురించిగానీ, పేదల గురించిగానీ బడ్జెట్లో ప్రస్తావన లేదని, పేదలకు కోతలు పెట్టినారే తప్ప మేలు చేయలేదని మండిపడ్డారు.
డీడీ డైలాగ్ పేరుతో గురువారం హైదరాబాద్లో దూరదర్శన్ నిర్వహించిన ప్రోగ్రామ్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ గురించి పూర్తిగా అబద్ధాలు మాట్లాడి బురదజల్లే ప్రయత్నం చేశారని మంత్రి విమర్శించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడింది నూటికి నూరుపాళ్లు నిజమని, ఆయన ప్రతి మాట ఆధారాలతో, లెక్కలతో మాట్లాడారని వెల్లడించారు.
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ ఉంటే కేంద్రం మెడికల్ కాలేజీలు కేటాయించాలని మంత్రి కోరారు. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన రూ.1.25 లక్షల కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి సంక్రమించిన అన్ని హక్కులను కేంద్రం గౌరవించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
కేంద్రప్రభుత్వ పెద్దలు ఫైనాన్స్ కమిషన్ నిర్ణయాలను తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మంత్రి హరీశ్రావు మండి పడ్డారు. ఆర్టికల్ 293కి లోబడి తెలంగాణ రాష్ట్రం అప్పులు తీసుకుందని, తీసుకున్న నిధులతో ప్రాజెక్టు నిర్మాణాలను, అభివృద్ధి పనులను చేపట్టామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తెచ్చి అభివృద్ధి చేయకపోగా మిత్తీలు కడుతోందని విమర్శించారు. రాష్ట్రంలోనూ అప్పులు పెరగడానికి కేంద్రమే కారణమని ఆరోపించారు.