పెద్ద వంగర: తండాల తండ్లాటను బాపింది కేసీఆర్ గారేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, గ్రామాలకు దీటుగా అభివృద్ధి చేసింది బీఅర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీతోనే తండాలకు మంచి భవిష్యత్తు ఉంటదని, మీరు నాకు అండగా నిలువాలని, మీకు నేను అండగా ఉంటానని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలంలో కాన్వాయ్ గూడెం, కొత్త తండా,
రాజ్ మాన్ సింగ్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మేఘ్యా తండా, అమర్ సింగ్ తండా, శంకర్ తండా, రంగి తండా, చిట్యాల పరిధిలోని శాంక్రు తండాలలో శనివారం తండా బాట చేపట్టారు. అలాగే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్ల కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటూ.. ఓట్లు అడుగుతూ ఆయన ప్రచారం సాగించారు.
డోలు కొట్టి దరువేశారు. ముసలవ్వ లతో, ముసలయ్యలతో ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భంగా మంత్రికి తండావాసులు ప్రత్యేకించి మహిళలు సంప్రదాయ పద్ధతుల్లో డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో బతుకమ్మలతో ఎదురేగి, కుంకుమ తిలకం దిద్ది మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఎడ్ల బండిపై ఊరేగించారు.
ఈ సందర్భంగా ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. ఒక్కో తండాను రూ.100 కోట్లకు తగ్గకుండా నిధులతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు.
బాగా ఆలోచించి ఓటు వేయాలని, అభివృద్ధికి అండదండగా ఉండాలని ఓటర్లను కోరారు. సాంలా తండాలో గిరిజనుల కోరిక మేరకు మంత్రి ఎర్రబెల్లి డప్పు కొట్టి, దరువేసి ప్రజల్లో ఉత్సాహం నింపారు. కాన్వాయ్ గూడెంలో ముసలవ్వతో ముచ్చటించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఓటు తనకే వేయాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా తండాల సర్పంచులు, గిరిజనులు పాల్గొన్నారు.