Damodar Raja Narsimha | హైదరాబాద్ నగర పరిధిలోని సరూర్నగర్ అలకనంద హాస్పిటల్లో చట్టవిరుద్ధంగా జరుగుతున్న కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెప్పించుకుని పరిశీలించారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని వైద్యులను మంత్రి హెచ్చరించారు. ఈ కేసులో భాగస్వామ్యులైన డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యం, ఇతర వ్యక్తులను ఉపేక్షించొద్దని, చట్ట ప్రకారం కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రైవేట్ దవాఖానల్లో తనిఖీలు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు కోసం ఆరోగ్యశాఖ అధికారులతో ఇదివరకే టాస్క్ఫోర్స్ కమిటీలను నియమించిన విషయాన్ని మంత్రి దామోదర్ రాజ నర్సింహా గుర్తు చేశారు.
ఈ టాస్క్ఫోర్స్ కమిటీలు మరింత పకడ్బందీగా పనిచేయాలని, ఇలాంటి వ్యవహారాలను నిరోధించేలా కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. హాస్పిటళ్లలో జరిగే ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. అలకనంద హాస్పిటల్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.