Telangana Martyrs Memorial | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నో అద్భుత నిర్మాణాలు చేపట్టింది. రాష్ర్టానికే కాకుండా యావత్తు దేశానికే గర్వకారణంగా నిలిచిన ఆ నిర్మాణాలపై ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ టీవీ చానళ్లు ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. అలాంటి విశిష్ఠమైన కట్టడాల్లో ఒకటైన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపంపై తాజాగా ‘హిస్టరీ టీవీ18’ చానల్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయనున్నది. సోమవారం రాత్రి 8 గంటలకు ‘యే మేరా ఇండియా’ కార్యక్రమంలో దీన్ని వీక్షించవచ్చు.
తెలంగాణ బిడ్డల శౌర్యాన్ని, త్యాగాన్ని చాటిచెప్పే ఈ స్మారక స్థూపాన్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన విషయం విదితమే. అమరవీరుల త్యాగాలు భవిష్యత్తు తరాలకు నిరంతరం స్ఫూర్తిని కలిగించేలా ఉండాలన్న ఆలోచనతో ప్రపంచ దేశాల్లోని పలు ఉక్కు నిర్మాణాలకు దీటుగా ఈ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 2.88 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మట్టిదీపం ఆకారంలో ఉండే ఈ స్థూపం ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణంగా ప్రసిద్ధికెక్కింది. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరంలో నిర్మితమైన ఈ అద్భుత స్థూపం విశేషాలను అందరూ వీక్షించాలంటూ ‘హిస్టరీ టీవీ18’ చానల్ ఇప్పటికే ప్రోమోలను విడుదల చేసింది.
3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో ఓ మ్యూజియంతోపాటు 100 మంది కూర్చునేందుకు వీలైన ఆడియో-విజువల్ హాలు, 650 మంది కూర్చునే విధంగా కన్వెన్షన్ సెంటర్, పర్యాటకుల కోసం ఓ రెస్టారెంట్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 350 కార్లు, 600 బైకులకు సరిపడా పార్కింగ్ సౌకర్యం ఉన్నది. హుస్సేన్సాగర్ అందాలతోపాటు బుద్ధ విగ్రహం, బిర్లా మందిర్, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాలను వీక్షించేకుందు వీలుగా టెర్రస్పై రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు.