Telangana Martyrs Day | దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమకొండలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, సీపీ రంగనాథ్తో కలిసి అదాలత్ సెంటర్లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
తెలంగాణ గర్వించదగ్గ మహనీయులు కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడిందన్నారు. అసువులు బాసిన అమరవీరులను మనం మరచిపోలేమని, ఇప్పటికీ ఉద్యమ రోజులు గుర్తు వస్తే బాధగా అనిపిస్తుందన్నారు. తాము నష్టపోయిన తర్వాతి తరాలు తెలంగాణ రాష్ట్రంలో బాగుపడాలి అని వీరమరణం పొందారని, వారికి మనం ఏమి చేసినా తక్కువేనన్నారు.
కానీ, వారికి అన్ని విధాలా రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి ఉద్యమ సారథి, నేటి సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డారన్నారు. అమరవీరులను, అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ గుర్తించారని, తెలంగాణ అమరవీరుల పథకం 576 మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారన్నారు. వారికి కష్టం వస్తే ప్రభుత్వం తరఫున సహాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్మృతికి ఘనంగా నివాళులు అర్పించేందుకు, అమరుల త్యాగాలను స్మరించేందుకు హైదరాబాద్లో మహాస్మృతి కేంద్రాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు.