కోనరావుపేట, అక్టోబర్ 6: ఉపాధి వేటలో దుబా య్ బాట పట్టిన యువకుడు ఓ హత్య కేసులో చిక్కుకొని 17 ఏండ్లు జైలు శిక్ష అనుభవించాడు. మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఇంటికి చేరాడు. కొడుకును చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ‘బతికొస్తవనుకోలేదు కొడుకా.. నీ పాణం ఎట్లున్నది బిడ్డా’ అంటూ తల్లి కన్నీళ్లపర్యంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన దండుగుల నర్సయ్య, లస్మవ్వ దంపతులకు కొడుకు లక్ష్మణ్ ఉపాధి కోసం 2004లో దుబాయ్ వెళ్లాడు.
అక్కడ నేపాల్కు చెందిన ఓ సెక్యూరిటీ గార్డు హత్య కేసులో ఇరుక్కుపోయి జైలుకు వెళ్లాడు. ఇతడితోపాటు సిరిసిల్ల మండలం పెద్దూరుకు చెందిన శివరాత్రి రవి, శివర్రాతి మల్లేశ్, శివరాత్రి హనుమంతు, గొల్లె నాంపెల్లి మరో నలుగురు శిక్ష అనుభవిస్తున్నారు. గతంలో మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటనకు వెళ్లినప్పుడు బాధితుల క్షమాభిక్ష కోసం షరియా చట్టం ప్రకారం రూ.15 లక్షలు చెల్లించారు. నేర తీవ్రత దృష్ట్యా అక్కడి అధికారులు వీరిని విడుదల చేయలేదు.
ఇటీవల మంత్రి కేటీఆర్ స్వయంగా దుబాయ్ వెళ్లి అక్కడి అధికారులు, ప్రభుత్వంతో మాట్లాడారు. ఇందులో కోనరావుపేటకు చెందిన లక్ష్మణ్ అనారోగ్యంతోపాటు తదితర కారణాల రీత్యా న్యాయవాది అభ్యర్థన మేరకు విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో శుక్రవారం ఇండియన్ ఎంబసీ అధికారులు స్వయంగా హైదరాబాద్లో లక్ష్మణ్ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మానసిక సమస్యతో బాధపడుతున్న లక్ష్మణ్ సురక్షితంగా ఇంటికి చేరా డు. తల్లి లస్మవ్వను చూసి కంటతడిపెట్టాడు. మంత్రి కేటీఆర్ దేవుడిలా వచ్చి లక్ష్మణ్ను ఇంటికి చేర్చాడని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.