హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తున్నది. సోమవారం 42,461 నమూనాలను పరీక్షించగా, 463 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు మంగళవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 145, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 46, రంగారెడ్డిలో 28, నిజామాబాద్లో 23, జగిత్యాలలో 20, వరంగల్ అర్బన్లో 19 కేసులు వెలుగుచూశాయి. ఏపీలో సోమవారం ఒక్కరోజే 993 కరోనా కేసులు రికార్డయినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా గుంటూరులో 198 కేసులు నమోదయ్యాయి.
12,565 మందికి తొలిడోస్
రెండోదశ వ్యాక్సినేషన్లో జోరుగా సాగుతున్నది. సోమవారం 12,565 మంది తొలిడోస్ వేసుకోగా, 40 మంది రెండోడోస్ తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు తొలిడోస్ తీసుకున్నవారి సంఖ్య 9.51లక్షలకు చేరగా, రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 2.34 లక్షలకు చేరింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ వృథా 1.05 శాతం మాత్రమే ఉన్నదని, ఇది దేశంలోనే అత్యల్పమని మంగళవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది.
గాంధీలో పెరిగిన కొవిడ్ వార్డులు
కరోనా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో మరో 100 పడకలను సిద్ధం చేస్తున్నామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మంగళవారం వరకు 116 మంది చికిత్స పొందుతున్నారని, ప్రమాదకరంగా ఉన్న కేసులను మాత్రమే చేర్చుకుంటున్నామని వివరించారు. ఇప్పటివరకు 200 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, ముందస్తు చర్యల్లో భాగంగా మరో 100 పడకలను కొవిడ్ వార్డులుగా మారుస్తున్నామని చెప్పారు.
యాదాద్రిలో స్వచ్ఛంద లాక్డౌన్..
యాదాద్రి, మార్చి 30: కరోనా వ్యాప్తి నేపథ్యంలో యాదాద్రిలో అటు ఆలయ అధికారులు, ఇటు వ్యాపారులు అప్రమత్తమమయ్యారు. స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్న వ్యాపారులు
మంగళవారం యాదగిరిగుట్టపట్టణంలో దుకాణాలు మూసి ఉంచారు. బుధవారం కూడా
లాక్డౌన్ పాటించనున్నారు.
3 వరకు యాదాద్రిలోఆర్జిత సేవలు రద్దు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు ఈవో ఎన్ గీత తెలిపారు. స్వామివారి నిత్యపూజలను అంతరంగికంగా చేపట్టి, భక్తులకు స్వామివారి లఘు దర్శనం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. కాగా మంగళవారం 24 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా ఇందులో 10 మంది ఆలయ సిబ్బంది ఉన్నారని వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు. ఇప్పటివరకు యాదాద్రి ఆలయంలో కరోనా బాధితుల సంఖ్య 83కు చేరింది.
ఇవీ కూడా చదవండి