ఇచ్చాద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప॥
భగవద్గీత (7-27) ‘జగత్తులోని ప్రాణులన్నీ రాగద్వేషాల వల్ల కలిగే సుఖదుఃఖాలు అనే ద్వంద్వాలలో కూరుకుపోతూ, అంతులేని మోహంలో పడిపోతున్నాయి’. ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచీ కొన్ని వస్తువుల మీద (కొందరు మనుషులపైనా) రాగమో, ద్వేషమో పెంచుకొని, తద్వారా కలిగే సుఖదుఃఖాల మాయలో చిక్కుకు పోతున్నాడు. అంటే, కొన్ని వస్తువుల మీద ఇష్టం పెంచుకొని వాటిద్వారా కలిగే సుఖమే నిజమైన సుఖమనుకుంటున్నాడు. ఆ సుఖాలను పొందడానికి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ, అవి లభించనప్పుడు బాధపడుతూ తన విధిని, భగవంతుడిని నిందిస్తూ, క్రుంగిపోతుంటాడు. ‘భౌతిక వస్తువుల మీద వ్యామోహం అనర్థదాయకమని, అవన్నీ అశాశ్వతాలని, శాశ్వతమైంది, సత్యమైంది, నిత్యమైంది పరమాత్మ ఒక్కడేనని’ అందరూ తెలుసుకోవలసి ఉంది. ‘జగత్తు మిథ్య’ అంటే, కంటికి కనబడే చరాచర ప్రపంచమంతా మాయ. ఒకప్పుడు లేవు, ఇప్పుడున్నాయి, రేపు ఉండబోవు. ఉదాహరణకు మన నగరాలు, గ్రామాలు ఒకప్పుడు ఎలా ఉండేవి? అప్పట్లో ఎన్ని, ఎలాంటి ఇండ్లు ఉండేవి? ఇప్పుడెలా ఉన్నాయి? మన కండ్లముందే ఎంత మార్పు! మనం చరిత్ర పాఠాలలో చదివిన రాజులు ఏరి? రాజ్యాలు ఇప్పుడు ఏమయ్యాయి? నిన్న మొన్నటి శ్రీకృష్ణదేవరాయలు స్థాపించిన హంపీ విజయనగర సామ్రాజ్యం ఇప్పుడేమైంది? కాలగతిలో కలిసిపోయింది. అశోకుడు, చంద్రగుప్తుడు, శాలివాహనుడు, శాతకర్ణి, రాణిరుద్రమ.. ఇలా గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్ర పుటల్లో మిగిలిపోయారు. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే వారేరీ సిరి మూటఁ గట్టుకొని పోవం జాలిరే భూమిపైఁ బేరైనం గలదే శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!
బమ్మెర పోతన (శ్రీమద్భాగవతం: 8-590)
‘పూర్వమూ ఎందరో రాజులున్నారు కదా. వారికి రాజ్యాలున్నాయి కదా. వాళ్లెంతో అహంకారంతో విర్రవీగిన వారేకదా. కానీ, వారెవరు సంపదలు మూట గట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా? శిబి చక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా’. కాలగర్భంలో కలిసి పోయేవన్నీ అశాశ్వతాలు. మనమెంతో ఇష్టంగా, అపురూపంగా వాడుకొనే సెల్ఫోన్లు, కెమెరాలు, టీవీలు ఒక వందేండ్ల మునుపు లేవు. ఇప్పుడు మనం వాటి మోజులో చిక్కుకున్నాం. ఇలాంటి వస్తువులు లభిస్తే సంతోషం (రాగం), లభించకపోతే దుఃఖం (ద్వేషం). కొన్ని మన వద్ద లేవు, ఎదుటివారి వద్ద ఉన్నాయని ఈర్ష్య, అసూయ. మరి కొందరికైతే తనకే ఉన్నాయనే మద, మాత్సర్యాలు. ఇలా అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు)లో చిక్కుకోవడం ద్వారా మనుషులు అనేకులు మాయలో కూరుకుపోతున్నారు. రేపు మరో కొత్త ఆవిష్కరణ జరుగుతుంది. ఇప్పుడు వాడే వస్తువులు త్వరలో కనుమరుగైపోతాయి. కనుక, ‘జగత్తంతా మాయే’ అన్నారు మన పెద్దలు. అందులోని వస్తువులూ మాయే. ఇలా అశాశ్వతమైన, భౌతికమైన వస్తువులపై మోజుతో జీవితాన్ని వ్యర్థం చేసుకొని, శాశ్వతుడైన పరమాత్మని మరిస్తే, మనకు లభించిన మానవజన్మను దుర్వినియోగం చేసుకొన్న వాళ్లమవుతాం. దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి మసలుకోవడం మంచిది.