హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) /నందికొండ: నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోవటాన్ని వెంటనే ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి శనివారం లేఖ రాసింది. డ్యామ్పై యథాతథస్థితి కొనసాగించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించినా ఏపీ పాటించడం లేదని ఆరోపించింది. పోలీసు, సీఆర్పీఎఫ్ బలగాలను డ్యామ్పై నుంచి ఉపసంహరించుకోలేదని తెలిపింది. ఇప్పటికీ కుడి కాలువ ద్వారా నీటిని మళ్లిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేసింది. వెంటనే జోక్యం చేసుకొని నీటి తరలింపును ఆపాలని, డ్యామ్పై యథాతథస్థితిని కొనసాగించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సర్కారు ఫిర్యాదుతో కేఆర్ఎంబీ బృందం నాగార్జునసాగర్ డ్యామ్ను శనివారం సాయంత్రం సందర్శించింది. ఎస్ఈ అశోక్కుమార్, ఈఈ రఘునాథ్ డ్యామ్పై నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు. సాగర్ ఎడమ, కుడి కాలువలను తనిఖీ చేశారు. అనంతరం కుడికాలువ 5వ నంబర్ గేటును మూసివేయించారు. శనివారం రాత్రి వరకు 7వ నంబర్ గేటును కూడా మూసివేయాలని అక్కడి అధికారులకు సూచించారు.
సంయమనం పాటించండి: కేంద్రం
నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంపై తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు సంయమనం పాటించాలని కేంద్ర జల్శక్తిశాఖ ఆదేశించింది. నాగార్జునసాగర్ డ్యామ్ ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా అక్రమించడం, కుడికాలువ గేట్లను తెరచి నీళ్లను మళ్లించడంపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా జలాల పంపిణీ వివాద పరిషారం, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై 6వ తేదీన మరోసారి సమావేశం నిర్వహించి కూలంకషంగా చర్చిస్తామని వెల్లడించారు. అప్పటివరకు ఇరు రాష్ట్రాలు సంయవనం పాటించాలని కోరారు. నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై 4వ తేదీన సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్ను ఆదేశించారు. అప్పటివరకు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపాలని సూచించారు. కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు వివాద పరిషారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.
6న మరోసారి భేటీ
కేంద్ర జల్శక్తిశాఖ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. అయితే ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సమావేశానికి హాజరుకాలేమని, 5వ తేదీ తరువాత సమావేశం నిర్వహించాలని కేంద్ర జల్శక్తిశాఖకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముందస్తుగానే లేఖ రాశారు. దీంతో 6వ తేదీన సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు సమాచారం అందించింది. కృష్ణా జలాల పంపిణీ వివాద పరిషారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై సమావేశంలో చర్చిస్తామని వెల్లడించింది.
నాగార్జునసాగర్కు సీఆర్పీఎఫ్ బలగాలు
నాగార్జునసాగర్ డ్యామ్పై ఆంధ్రా అధికారుల రగడ కొనసాగుతూనే ఉన్నది. నవంబర్ 30వ తేదీ రాత్రి ఏపీ అధికారులు, పోలీస్ బలగాలు దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటి విడుదల చేయడంతో మొదలైన ఉద్రిక్త పరిస్థితులు శనివారం కూడా కొనసాగాయి. సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించిన కేఆర్ఎంబీ సభ్యులు డ్యామ్ను సందర్శించి కుడి కాల్వకు నీటి విడుదలను నిలుపుదల చేయాలని ఆదేశించినా అక్కడి అధికారులు బేఖాతరు చేశారు. డ్యామ్పైన అడ్డంగా కంచెను ఏర్పాటు చేసి తెలంగాణ అధికారులను, కాపలా ఉండే ఎస్పీఎఫ్ బలగాలను అడ్డుకున్నందుకు గాను కేంద్రం జోక్యం చేసుకొని సీఆర్పీఎఫ్ బలగాలను పంపించింది. అయితే.. శనివారం డ్యామ్ వద్దకు వచ్చిన సీఆర్పీఎఫ్ బలగాలను ఆంధ్రా ప్రాంతం నుంచి డ్యామ్పైకి వచ్చేందుకు ఆ రాష్ట్ర అధికారులు అనుమతించలేదు. పైగా తెలంగాణ రాష్ట్ర అధికారులు, పోలీసులపైన ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఆంధ్రా వైపు ఉన్న తెలంగాణ ప్రత్యేక రక్షకదళం గార్డు రూమ్పైన ఏర్పాటు చేసిన తెలంగాణ బోర్డును ఆంధ్రా రక్షక దళంగా రాసుకున్నారు.
పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం రెండు బెటాలియన్ల (160 మంది) సీఆర్పీఎఫ్ జవాన్లను శుక్రవారం పంపించింది. ఒక బెటాలియం ఆంధ్రా వైపు ఉన్న డ్యామ్ వద్దకు చేరుకున్నారు. వారిని ఆంధ్రా అధికారులు డ్యామ్పైకి పంపించకుండా నివారించారు. తమకు ఎటువంటి ఆదేశాలు లేవని చెప్పడంతో చేసిదేమీ లేక వారు డ్యామ్కు అవతల పడిగాపులు కాస్తున్నారు. శనివారం తెలంగాణ వైపు ఉన్న డ్యామ్ వద్దకు మరో సీఆర్పీఎఫ్ బెటాలియం చేరుకోగా వారిని అనుమతించి డ్యామ్పై పరిస్థితులను తెలంగాణ అధికారులు, పోలీసులు వివరించారు. తెలంగాణ పోలీస్ బలగాలను వెనుకకు పంపించారు. కాగా, కేఆర్ఎంబీ అధికారులు ఆదేశించినప్పటికీ ఏపీ అధికారులు నీటి విడుదలను ఆపలేదు. తమ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చేవరకు నీటి విడుదల ఆపటం కుదరదని తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేక కేఆర్ఎంబీ సభ్యులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా కేంద్ర జల వనరులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వీఎన్ రావు మాట్లాడుతూ.. వివాదాన్ని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.