హైదరాబాద్, మార్చి15 (నమస్తే తెలంగాణ): కేటాయింపులకు మించి కృష్ణా నదీజలాలను అధిక మొత్తం లో వినియోగించుకుంటున్న ఏపీని నిలువరించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బుధవారం మరోసారి లేఖ రాశారు. 66:34 నిష్పత్తిలో ఏపీ 641.05, తెలంగాణ 330.23 టీఎంసీలను వినియోగించుకోవాల్సి ఉన్నదని తెలిపారు. మార్చి 10 నాటికే ఏపీ 60 టీఎంసీలను అధికంగా వినియోగించుకున్నదని, ఇప్పటికీ యథేచ్ఛగా నీటిని వినియోగించుకుంటున్నదని వివరించారు. ఫలితంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయని, ఇది తెలంగాణ నీటిహక్కులకు తీవ్ర భంగం కలిగించనున్నదని నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ నుంచి నీటిని వినియోగించకుండా వెంటనే ఏపీకి ఆదేశాలు జారీ చేయాలని ఈఎన్సీ ఆ లేఖలో డిమాండ్ చేశారు.