కరీంనగర్ కలెక్టరేట్, జూలై 28: దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, విజయవంతంగా కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పేదల పెద్దన్నగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నో అవాంతరాలు నెలకొన్నా రాష్ట్రంలో మాత్రం సంక్షేమ పథకాలు నిర్విగ్నంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
గురువారం ఆయన కరీంనగర్లోని జడ్పీ సమావేశ మందిరంలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 222 మందికి రూ.2.20 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ఒక్కో మెట్టు అధిరోహిస్తుండగా, ఓర్వలేని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. ఇలాంటి పథకాలు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలనే డిమాండ్ వస్తున్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం సంక్షేమంపై నోరు మెదపడం లేదని విమర్శించారు.